హైదరాబాద్ : బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుంటే.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఉరికిస్తామంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఇన్నాళ్లు సహించామని, ఇకపై సహించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్ర, కర్ణాటక కాదని ఇది తెలంగాణ అని, ఆత్మగౌరవం ఉన్న బిడ్డలం, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
మునుగోడు ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చారని, ఈ ఫలితంతో కేసీఆర్ దెబ్బతో ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులు అబ్బా అనే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. ఈటల రాజేందర్కు ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఈటల అనుచరుడు చొప్పరి వేణు నోట్ల కట్టలతో దొరికాడనేది నిజం కాదా? అని నిలదీశారు. దీనికి ఈటల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల పీఏ కూడా కోటి రూపాయలతో దొరికాడన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల హత్యా రాజకీయాలు చేస్తున్నాడని కౌశిక్రెడ్డి ఆరోపించారు. బాలరాజు అనే టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ సభ్యుడిని 2014లో హత్య చేయించాడని, తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ యాదవ్ను పోలీసోళ్లతో థర్డ్ డిగ్రీ చేయించి గుండెపోటుతో చనిపోయేలా చేశాడని.. ఇది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 2018లో కమలాపూర్ మండలం మర్రిపెల్లి గూడెంలో తనను హత్య చేయించేందుకు ప్రయత్నం చేశాడని కౌశిక్రెడ్డి ఆరోపించారు.
ఈటల హత్య రాజకీయాలు మునుగోడులో మరోసారి నిరూపితమయ్యాయని, పలివేలలో టీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ జగదీశ్లను హత్య చేయాలని చూశాడన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇప్పుడు కనీసం వార్డు మెంబర్గా అయినా గెలుస్తాడా? అంటూ సెటైర్లు వేశారు. కేటీఆర్ గురించి ఏమైనా మాట్లాడితే ఖబర్దార్ అంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. వివేక్ వెంకటస్వామి కేటీఆర్ ఎంటుకతో బరాబార్ తీవ్రంగా మండిపడ్డారు. వివేక్ వెంకటస్వామి రూ.75 కోట్లను రాజగోపాల్ రెడ్డి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు.
మరో రూ. 25 కోట్లు జమున హాచరీస్కు ట్రాన్స్ఫర్ చేశావా? లేదా? అని నిలదీశారు. ఈటల రాజేందర్ గెలిచి సంవత్సరం అవుతుందని, ఆనాడు ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టో విడుదల చేసిన దాంట్లో ఒక్కటైనా అమలు చేశావా? తట్టెడు మట్టి అయినా తీశావా? ఒక్కరికైనా మూడు వేల పింఛను ఇచ్చినవా..? కనీసం లక్ష రూపాయల కేంద్ర నిధులతో పని చేశావా? అంటూ ప్రశ్నించారు.