హిమాయత్నగర్, ఆగస్టు 3: చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకే కేంద్రం వస్ర్తాలపై 12 శాతం జీఎస్టీ విధించిందని, వెంటనే దాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. బుధవారం నారాయణగూడలోని పద్మశాలిభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం ఏ ప్రభుత్వాలూ చేనేత వస్ర్తాలపై పన్ను విధించలేదని.. తొలిసారి కేంద్రంలోని మోదీ సర్కారు విధించిందని మండిపడ్డారు.
జీఎస్టీతో చేనేత వస్ర్తాల అమ్మకాలు తగ్గి, కార్మికులపై ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. చేనేతపై జీఎస్టీ తొలగించాలని చేస్తున్న జాతీయస్థాయి ఉద్యమానికి టీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తున్నదని వెల్లడించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా.. ఇంటింటిపై జాతీయ జెండా ఎగురవేసేందుకు తెలంగాణ సర్కారు కోటి జెండాల తయారీ ఆర్డర్ను నేత కార్మికులకు ఇచ్చిందని వివరించారు. అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న మాట్లాడుతూ.. ఈ నెల 15లోపు చేనేత వస్ర్తాలపై జీరో జీఎస్టీని ప్రకటించాలని, లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. సమావేశంలో సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుశ్యంతల, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆవ్వారి భాస్కర్, సంఘం నాయకులు పాల్గొన్నారు.