MLC Kavitha | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఈడీ తనను అరెస్ట్ చేయడం ద్వారా కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవిత తరఫున న్యాయవాది మోహిత్రావు సోమవారం ఉదయం 6:30 గంటలకు ఆన్లైన్లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగానే అరెస్టు చేశారని కవిత పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని స్వయంగా కోర్టులోనే చెప్పారని గుర్తుచేశారు. ఆ మాటను మీరి అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈడీ చర్యలను కోర్టు ధికరణకు పాల్పడినట్టుగా భావించి, సంస్థపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉన్నది. మరోవైపు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ కవిత నిరుడు మార్చిలో దాఖలుచేసిన రిట్ పిటిషన్పై విచారణ కూడా మంగళవారం జరుగనున్నది .ఈ నేపథ్యంలో రెండు పిటిషన్లపై ఒకేసారి విచారణ జరిపే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోమవారం కేటీఆర్, హరీశ్రావు కలిశారు. సాయంత్రం నిర్దేశించిన సమయంలో వారు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కవితతో చర్చించిన అనంతరం వారు తిరిగి వెళ్లిపోయారు.
245 ప్రాంతాల్లో సోదాలు చేశాం
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేపథ్యంలో ఈడీ సోమవారం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో భాగంగా దేశవ్యాప్తంగా 245 ప్రదేశాల్లో సోదా లు చేశామని వెల్లడించింది. మొత్తం 15 మం దిని అరెస్ట్ చేశామని తెలిపింది. వారిలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియా, సంజయ్సింగ్, విజయ్నాయర్ వంటివారు ఉన్నట్టు పేర్కొన్నది. ఒక ప్రధాన ఫిర్యాదుతోపాటు ఐదు అనుబంధ ఫిర్యాదులను నమోదు చేసినట్టు తెలిపింది. ఇప్పటివరకు 128.79 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15న ఆమె ఇంట్లో అరెస్ట్ చేసినట్టు తెలిపింది. తమకు అనుకూలంగా మద్యం విధానాన్ని రూపొందిస్తే రూ.100 కోట్లు ముట్టజెప్పేలా కవిత, కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా ఆప్ ముఖ్య నేతల మధ్య ఒప్పం దం కుదిరినట్టు విచారణలో తేలిందని పేర్కొం ది. హోల్సేలర్ల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి అక్రమంగా నిధుల వరద పారిందని తెలిపింది. కవిత, ఇతర భాగస్వాములు కలిసి ఆప్కు ముట్టజెప్పిన మొత్తాన్ని తీసుకోవడంతోపాటు అదనంగా డబ్బు సంపాదించాలని ఆప్ ప్రణాళిక రూపొందించినట్టు వెల్లడించింది.