నిజామాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నందిపేట: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ ఘట్టంలో రెండోరోజైన ఆదివారం వైదిక కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు రుత్వికులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత-దేవనపల్లి అనిల్ దంపతులతోపాటు దేవనపల్లి రామ్కిషన్రావు -నవలత, దేవనపల్లి అరుణ్-ననితలు ఆయా క్రతువుల్లో పాల్గొన్నారు. ఉదయం ప్రాతారాధన, సేవాకాలం, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధన వంటి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం చతుఃస్థానార్చన, అరని మథనం, యాగశాల ప్రవేశం నిర్వహించారు.
అనంతరం మూల మంత్రమూర్తి, మంత్ర హవనం, చాయాధివాసం, వాస్తు శాంతి, వాస్తు పర్యగ్నీకరణం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనం నిర్వహించారు. నిత్య పూర్ణాహుతి, మంగళశాసనము, వేద విన్నపాలు వైభవంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. గోదావరి నదికి ఎమ్మెల్సీ కవిత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలను ఆలయానికి తీసుకొచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్ హాజరయ్యారు. మధ్యాహ్నం 5 వేల మందికి వివిధ రకాల వంటకాలతో భోజనం ఏర్పాటుచేశారు.