కమ్మర్పల్లి/మోర్తాడ్, ఆగస్టు 28: ‘సీఎం కేసీఆర్తోనే తెలంగాణ తలెత్తుకున్నదని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ‘తొమ్మిదేండ్ల కిందట తెలంగాణ ఎట్లుండే. ఇప్పుడెట్లున్నది?’ అని అన్నదాతలు, ప్రజలను ప్రశ్నించారు. ‘ఇక్కడ ఎకరం భూమి ధర అప్పుడెంత ఉండే.. ఇప్పుడెంత ఉన్నది?.. ఎవుసం అప్పుడెట్ల ఉండే.. ఇప్పుడెట్ల ఉన్నది.’ ఒక్కసారి రైతులు ఆలోచన చేయాలని కోరారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డితో కలిసి సోమవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో రూ.8.25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నాగాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీని ప్రారంభించి, విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ రైతు తల దించుకోవద్దు.. తల ఎత్తుకోవాలని మంకుపట్టుబట్టి సీఎం కేసీఆర్ పనిచేయడం వల్లే తెలంగాణలో వ్యవసాయం పండుగ అయ్యిందని గుర్తించాలని అన్నారు. రూ. 19 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయడంతోపాటు రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లో రూ. 73 వేల కోట్లు జమచేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా, వ్యవసాయం బాగుండాలన్నా రైతు నాయకుడు కేసీఆర్ సీఎంగా ఉండాలన్న విషయాన్ని అన్నదాతలు గుర్తించాలని కోరారు.
బీజేపీ గురించి మాట్లాడటమే వేస్ట్:కవిత
కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటేస్తే మురుగుకాలువలో వేసినట్టేనని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బీజేపీ గురించి మాట్లాడుకోవడం కూడా దండుగేనని అన్నారు. వ్యవసాయానికి మూడుగంటల కరెంటే చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ అంటున్నారని, మరి మూడు గంటలతో మూడెకరాలు ఎట్లా పారుతుందని ప్రశ్నించారు. ‘అది ఎవుసం తెలిసిన ముఖమా.. ఎద్దు తెలిసిన ముఖమా..నాగలివట్టిన ముఖమా.. మందుజల్లిన ముఖమా’ అంటూ రేవంత్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాల్కొండలో కాంగ్రెస్కు చెందిన సునీల్రెడ్డి కనిపిస్తే ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని ప్రశ్నించాలని అడగాలని ప్రజలకు సూచించారు. రాజకీయ సుస్థిరత, శాంతి భద్రతలు ఇచ్చే, పట్టుదల ఉన్న నాయకుడు మన రాష్ర్టానికి సీఎంగా ఉన్నారు కనుకనే మారుమూల గ్రామాల్లో సైతం అభివృద్ధి వెలుగులు విరబూస్తున్నాయని తెలిపారు. కేసీఆర్కు సైనికుడిలాంటి వ్యక్తి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అని, ముఖ్యమంత్రి బాటలోనే వేముల బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారని చెప్పారు. ప్రశాంత్రెడ్డికి వేసే ప్రతి ఓటూ కేసీఆర్కు బలాన్ని చేకూరుస్తుందని చెప్పారు.
తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణి: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. 75 ఏండ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీలు గ్రామాల్లోని సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయాయని, మరి తెలంగాణలో ఏవిధంగా సాధ్యమయ్యిందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. నిర్మల్ జిల్లాను ఆనుకొని ఉన్న మహారాష్ట్ర గ్రామాలైన కీనీ, అప్పారావుపేట గ్రామాల్లో పింఛన్ రూ.600, 6 గంటల కరెంటు మాత్రమే వస్తుందని చెప్తున్నారని, తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు చూసి వారి గ్రామాలను తెలంగాణలో కలుపాలని కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించగానే.. సీఎం చేసిన అభివృద్ధిని చూసి గ్రామాలకు గ్రామాలు కారు గుర్తుకు ఓటేస్తామని తీర్మానాలు చేసుకుంటున్నాయని చెప్పారు.
కేసీఆర్ వెంటే నడుద్దాం: ఎంపీ సురేశ్రెడ్డి
కేసీఆర్ నాయకత్వంలో సాధించుకొన్న తెలంగాణ అనతికాలంలోనే అభివృద్ధిలో మెరుస్తున్నదని రాజ్యసభ సభ్యుడు కేఈఆర్ సురేశ్రెడ్డి పేర్కొన్నారు. పచ్చబడ్డ తెలంగాణపై అందరికండ్లు పడ్డాయని, అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో లబ్ధిపొందాలనే దురాలోచనతో కొందరు ఎన్నికల వేళ వచ్చి మాయమాటలు చెప్తున్నారని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. వాళ్ల మాటలు నమ్మితే ఉన్నది ఊడ్చుకుపోతారని ప్రజలను హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధిబాటలోనే పయనించాలంటే అందరూ సీఎం కేసీఆర్ వెంటే నడువాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు లక్ష్మారెడ్డి, కోటపాటి నర్సింహనాయుడు, రాజారాంయాదవ్ పాల్గొన్నారు.
సోదరులకు హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వండి: కవిత సూచన
రాఖీ పండుగ సందర్భంగా సోదరులకు హెల్మెట్ను గిఫ్ట్గా ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళాలోకానికి విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన డ్రైవింగ్ లైసెన్సుల జారీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి యువత కోసం డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించే గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో బంగారు పాలన కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కవిత ప్రోత్సాహంతో కమ్మర్పల్లిలో రూ.3 కోట్లతో స్టేడియం నిర్మించుకున్నట్టు మంత్రి వేముల చెప్పారు. యువత కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఒకేరోజు డ్రైవింగ్ లైసెన్సు ప్రక్రియ పూర్తి అవుతున్నది కేవలం బాల్కొండ నియోజకవర్గంలో మాత్రమేనని చెప్పారు.