హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థలకు, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. శుక్రవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో దయాకర్రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలకు నిధులు కేటాయించాలని, ఇతర పనులకు నిధులు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, నిధులు కేటాయిస్తామని మంత్రి దయాకర్రావు తెలిపారు.