హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న ‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై జరిగే చర్చలో ఆమె పాల్గొననున్నారు. ఈ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవితతోపాటు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వాసంతి శ్రీనివాసన్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడుతారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కవిత వివరించనున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యతతోపాటు తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ గురించి తెలియజేయనున్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ఆమె ఎండగట్టనున్నారు.