హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత (MLC Kavitha) కుమారులు ఆదిత్య, ఆర్యా చిన్న వయస్సులోనే పెద్ద మనస్సును చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల ఆదిత్య, ఆర్యా కలిసి మొదలుపెట్టిన సినర్జీ ఆఫ్ మైండ్స్ (SOM) ఫౌండేషన్ ద్వారా ఆడబిడ్డల చదవుకు చేయూతనిచ్చారు. హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజీలో అడ్మిషన్ పొందినవారిలో ఆర్థికంగా వెనుకబడిన 10 మంది మహిళా విద్యార్థులకు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్లను అందజేశారు. వారిలో ఆరుగురు డిగ్రీ, ముగ్గురు పీజీ విద్యార్థినులు ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత, కాలేజీ ప్రతినిధుల సమక్షంలో విద్యార్థులకు ఆదిత్యా, ఆర్యా స్కాలర్షిప్ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు తాము ఎప్పుడూ మద్ధతిస్తాని తెలిపారు. తన కుమారులు ఇద్దరు సమాజసేవ కోసం ఫౌండేషన్ను స్థాపించి విద్యార్థులకు చేయుతనందించడం సంతోషంగా ఉందన్నారు. చిన్న వయస్సుల్లోనే వాళ్లు గొప్పగా ఆలోచించడం తల్లిగా తనకు గర్వంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఫౌండేషన్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సమాజంలో మంచిపేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. స్కాలనఖషిప్ అందుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. చదువులో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.