హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలో డిగ్రీ చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేవు కానీ, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉన్నదంటూ ప్రధాని మోదీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురకలేశారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగంపై ఆదివారం ఆమె ట్విట్టర్లో ఆందోళన వ్యక్తంచేశారు. ‘దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉన్నది. ఇది మూడు నెలల గరిష్ఠ స్థాయి.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైంది? మోసపూరిత హామీతో యువతను దగా చేస్తిరి కదా’ అంటూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. అసలు వాటిని భర్తీ చేసే ఉద్దేశం కనిపించడం లేదని విమర్శించారు. యువత పట్ల ఏమైనా ఆందోళన ఉన్నదా? లేదా? యువత శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకునే కృషి ఏమైనా చేస్తున్నారా? అని నిలదీశారు.