హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన కుల గణనకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులతో కలిసి శనివారం ఆమె తన నివాసంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పించాలని పేర్కొన్నారు. చూస్తుంటే కులగణన తీర్మానం కంటితుడుపు చర్యలా ఉందని, బీసీ కులగణన ఎప్పటిలోగా పూర్తిచేస్తారు? ఎలా చేస్తారు? బడ్జెట్లో కేటాయించిన నిధులెన్ని? దాని లక్ష్యాలేమిటి? అన్న విషయంలో స్పష్టత లేదని విమర్శించారు. తీర్మానానికి తలాతోక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, బీహార్, కర్ణాటకలో కులగణనకు ముందు చట్టం చేశారని తెలిపారు. బీహార్లో కులగణన చేపట్టి 75 శాతం రిజర్వేషన్లు పెంచుకున్నారని, వెనుకబడిన కులాలకు 25 శాతం రిజర్వేషన్లు పెంచినట్టు పేర్కొన్నారు. అక్కడ బీసీలకు 43శాతం రిజర్వేషన్లు పెంచారని తెలిపారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్టుగా బీసీలకు ఇస్తానన్న రూ. 20 వేల కోట్లు పూర్తిగా ఇవ్వాలని, మహాత్మా జ్యోతిరావుఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.
కొమటిరెడ్డికి బీసీలంటే గౌరవం లేదు
మహాత్మాఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని తాము డిమాండ్ చేస్తే మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెటకారం చేస్తున్నారని యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్రావు మండిపడ్డారు. అసెంబ్లీలో పెట్టిన తీర్మానంతో బీసీ సమస్యలు తీరిపోయినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ మధుసూదనాచారి విమర్శించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానంలో అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. కులాల వారీగా అందరి ఆత్మగౌరవం కాపాడిన ఏకైక నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని యూపీఎఫ్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశంసించారు. ఈ సందర్భంగా కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యూపీఎఫ్ నాయకులు బొల్ల శివశంకర్, తాడూరి శ్రీనివాస్, రాజారాం యాదవ్, ఆలకుంట్ల హరి, కోల శ్రీనివాస్, ఆర్వీ మహేందర్, విజేందర్ సాగర్, ఏల్చల దత్తాత్రయ, గీతా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి
కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 2011లో యూపీఏ హయాంలో చేసిన కులగణన నివేదికను కాంగ్రెస్ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. తమను అనేముందు కాంగ్రెస్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని చురకలంటించారు. రాబోయే రోజుల్లో యూత్, ఎస్సీ, ఎస్టీ, రైతు డిక్లరేషన్ల గురించి కూడా ప్రశ్నిస్తామని, బీసీ అంశాలు కాలపరిమితితో కూడుకున్నవి కాబట్టి ఇప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. నాడు బీఆర్ఎస్ పార్టీ బీసీ కులగణన చేయాలని, బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ కేటాయించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు గుర్తు చేశారు. బీసీల హక్కుల గురించి తాము మాట్లాడుతుంటే సీఎం హోదాలో రేవంత్రెడ్డి సంకుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.