MLC Kavitha | హైదరాబాద్ : సాహితీ ప్రేమికులుగా హిందీ భాషలో ఉన్న సాహిత్యాన్ని ఆరాధిస్తామని, కానీ ఇదే మాట్లాడాలని రూల్స్ పెడితే మాత్రం తప్పకుండా రూల్స్ బ్రేక్ చేస్తాం అని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ అనే పరిమిత దృక్పథం నుంచి భారతీయత అనే విశాల దృక్పథం వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉందన్నారు కవిత.
హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన తెలంగాణ సాహిత్య సభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను ఎమ్మెల్సీ కవిత అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ గోరేటి వెంకన్న, డాక్టర్ తిరునగరి దేవకిదేవి, డాక్టర్ గోగు శ్యామల, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, డాక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి, టి యస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, భారత్ జాగృతి జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి, పలువురు ప్రముఖ కవులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకోవడం ఎంత ముఖ్యమో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవడం అంతే ముఖ్యమన్న నినాదంతో ఉద్యమం చేసహామన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత సాహిత్య వికాసాన్ని, సాహితీ పుత్రులను నిరంతరం స్మరించుకోవడంతో పాటు తెలుగు సాహిత్యాన్ని తెలంగాణ వాళ్ళు మరింత పరిపుష్టం చేయాలన్న ఉద్దేశంతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహితీ సభలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఇకపై ప్రతీ ఏటా తెలంగాణ సాహిత్య సభలు జరుపుతామని ప్రకటించారు.
హిందీ చక్కటి భాష అని, తనకు ఇష్టమైనది కూడా అని కవిత చెప్పారు. హిందీ పాటల్లో పదాలు అధ్భుతంగా ఉంటాయన్నారు. అయితే, ఎవరి భాష వాళ్లకు ఉంటుందని, కానీ ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేశారు. సాహితీ ప్రేమికులుగా హిందీ భాషలో ఉన్న సాహిత్యాన్ని ఆరాధిస్తామని, కానీ ఇదే మాట్లాడాలని రూల్స్ పెడితే మాత్రం తప్పకుండా రూల్స్ బ్రేక్ చేస్తామని తేల్చిచెప్పారు. ఇటువంటి విచిత్రమైన పరిణామాలు దేశంలో జరుగుతున్న సందర్భంలో తెలంగాణ అనే పరిమిత దృక్పథం నుంచి భారతీయత అనే విశాల దృక్పథం వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి భారత్ జాగృతిగా రూపాంతరం చెందిందని కవిత పేర్కొన్నారు.
సమానత్వం కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఉద్యమాన్ని మొదలుపెట్టే ముందే తెలంగాణకు చెందిన భాగ్యరెడ్డి వర్మ తన గొంతు వినిపించారని కవిత తెలిపారు. ఆనాడే ఆదిహిందు అనే సంస్థను స్థాపించిన భాగ్యరెడ్డి వర్మ సమానత్వం కోసం పాటుపడడం మనకు గర్వకారణమన్నారు. తెలంగాణకు అటువంటి చైతన్యం ఉంది కాబట్టి మన గొంతుకను వినిపించాలని, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ కోరితే నమస్తే తెలంగాణ సంస్థ పుట్టిందని తెలియజేశారు. నమస్తే తెలంగాణ పెట్టకముందు తెలంగాణ ఉద్యమంపై అనేక అబద్ధాలు ప్రచారం అయ్యేవని, వాటిని చెల్లాచెదురు చేస్తూ మనకు నమస్తే తెలంగాణ గొంతుకగా నిలిచిందని కవిత పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో అప్పట్లో తెలంగాణ జాగృతిని ప్రారంభించామని కవిత తెలిపారు. రాసేవాళ్లకు మద్దతివ్వాలని జయశంకర్ ఎప్పుడూ చెప్పేవారని, వంద మాటలు మాట్లాడడం ఒక ఎత్తు.. ఒక పదం రాయడం ఒక ఎత్తు, కాబట్టి రాయడానికి అంతటి శక్తి ఉందని కేసీఆర్ అనేవారని వివరించారు. ఆ దిశగా జాగృతి అనేక కార్యక్రమాలు చేస్తుందని కవిత స్పష్టం చేశారు.
జీవితాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు ఎమ్మెల్సీ కవిత. జయశంకర్ వర్థంతి సందర్భంగా ఆమె ఘన నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అనునిత్యం ప్రజలను జాగరూక పరుస్తూ సీఎం కేసీఆర్ వెంట నిలిచిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ అని అన్నారు కవిత.