కోరుట్ల : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వవద్దని, తెలంగాణను తెర్లు చేసుకోవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha( ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజల బతుకులు బాగుంటాయని చెప్పారు. బీఆర్ఎస్(BRS)ను గెలిపిస్తే ప్రజలు గెలుస్తారని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను గెలిస్తే కేవలం ఆ పార్టీలు మాత్రమే గెలుస్తాయని, కాబట్టి కారు గుర్తుకు ఓటేసి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు గెలవాలని తేల్చి చెప్పారు.
గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల(Korutla) నియోజకవర్గంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్(Kalavakuntla Sanjay)తో కలిసి కవిత బండలింగాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ..గ్రామాల్లో చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయని తెలిపారు. ‘‘చెరువు ఎండిపోయినప్పుడు చెరువును విడిచిపెట్టి కప్పలు వెళ్లిపోతాయి. కానీ చేపలు మాత్రం చెరువు నిండినా ఎండినా అక్కడే ఉంటాయి.
బీఆర్ఎస్ పార్టీ వాళ్లు చేపల్లాంటి వాళ్లు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కప్పల వంటి వాళ్లు” అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ కోసం బీజేపీ ఎప్పడూ మాట్లాడలేదని, సీఎం కేసీఆర్ దీక్ష చేసేంత వరకు ఒక్కరు మాట్లాడలేదని విమర్శించారు. వాళ్ల మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. చెరువులు ఎండిన నాడు ప్రజలతో బీఆర్ఎస్ ఉందని, ఇప్పుడు చెరువులు నిండిననాడు కూడా ప్రజలతోనే బీఆర్ఎస్ ఉందని వివరించారు. కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉంటేనే మనవాడు అవుతారని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని, బీడీ కార్మికుల పెన్షన్లకు కటాఫ్ డేట్ తీసేస్తామని సీఎం కేసీఆర్ అన్నారని, కాబట్టి ఎన్నికల తర్వాత బీడీ కార్మికులందరికీ పెన్షన్లు వస్తాయని చెప్పారు. అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ మద్ధతిస్తున్నారని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపరీతంగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచితే దాన్ని తగ్గించడానికి సీఎం కేసీఆర్ కృషి చేశారని, రూ. 400 కే సిలిండర్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారన్నారు.
బీఆర్ఎస్ వాళ్ల తలకాయ తీసేయాలని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ఇవేం మాటలు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. మాకు మర్యాద ఉన్నది. వాళ్లకు మర్యాద లేదు.” అని వ్యాఖ్యానించారు. రైతుబంధు మొత్తాన్ని పెంచాలని కూడా సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే మంచి భవిష్యత్తు బాగుంటుందని, తెచ్చుకున్న తెలంగాణను తెర్లు చేసుకోవద్దని, తెలంగాణను దొంగల చేతిలో పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రజల ఆశీర్వాదంతో దక్షిణ భారత దేశంలో తొలిసారి హ్యాట్రిక్ సీఎం అయ్యి కేసీఆర్ రికార్డు సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంజయ్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత, ఎంపీపీ సాయి రెడ్డి, సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.