హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణ (Assembly)లో మహాత్మా జ్యోతిరావు పూలే(Phule) విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు అంటగట్టడం సరికాదని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అన్నారు. భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా? అని సూటిగా ప్రశ్నించారు.
స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిం చామన్నారు. ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామన్నారు.
రాజకీయాల కోసం, సంకుచిత మనస్తత్వంతో ఈ మహా కార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నట్లు చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే మహోన్నతుడు, అణగారిన ప్రజల్లో చైతన్యం నింపిన మహా మనిషి. అందుకే ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుఫునే కాకుండా యావత్ తెలంగాణ ప్రజల తరుఫున వినమ్రంగా మరోసారి కోరుతున్నానని కవిత తెలిపారు.