హైదరాబాద్: తెలంగాణ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం తెలంగాణ ప్రజలు ఎంతో ఘనంగా చేసుకుంటారని అన్నారు. అంతరించి పోతున్న కళను బతికించేందుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య చేస్తున్న కృషిని కవిత అభినందించారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో మేడారం సమ్మక్క సారక్క జాతర డాక్యుమెంటరీని ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించిన ఫిల్మ్ మేకర్ బాలాజీ దూసరిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు.
ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్యను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించడానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నదని రామచంద్రయ్య గుర్తుచేశారు. సమ్మక్క సారలమ్మ జాతరలో రామచంద్రయ్యకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్నది. వనదేవతలకు తన డోలు వాయిద్యాన్ని వాయిస్తూ పూజలు నిర్వహిస్తారు. ఈసారి జాతరలో కూడా రామచంద్రయ్య డోలు మోగనున్నది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుతోపాటు తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అర్చన, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.