హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): డాక్టర్ ప్రీతి మరణంతో ఒక తల్లిగా తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, ప్రీతి కోలుకోవాలని ఆకాంక్షించిన కోట్లాది మందిలో తాను కూడా ఒకరినని పేర్కొన్నారు. మంగళవారం ఆమె ప్రీతి తల్లిదండ్రులు నరేందర్, శారదకు లేఖ రాశారు. ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతున్నానని, చదువుకొని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ఆమెకు ఇలా జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయిందని, అందుకు తాను విచారం వ్యక్తంచేస్తున్నానని వివరించారు. కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తకువే అవుతుందని పేర్కొన్నారు. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రీతి కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశంలో ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.