MLC Kavitha | పేదరికమే కొలమానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తోందని, ఏ కులంలో అయినా పేదవారు ఉంటే వారికి ప్రభుత్వం అండగా నిలబడుతూ పనిచేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్లో బిగాల కృష్ణమూర్తి ఆర్యవైశ్య భవన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. పేద ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన ఇళ్లలో ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఏ ప్రభుత్వమైనా చేదోడు వాదోడుగా నిలబడిందా? అన్న విషయాన్ని ఆలోచించాలని కోరారు.
పూర్వకాలం నుంచి వైశ్యలు పది మందికి అన్నంపెట్టేవాళ్లన్న పేరు ఉందన్నారు. ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాతినిధ్యం కూడా తమ పార్టీ కల్పిస్తోందని, నామినేటెడ్ పోస్టుల్లోనూ అవకాశం కల్పించామని, భవిష్యత్తలో మరిన్ని అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్య భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 కోట్లను ఇచ్చిందని గుర్తు చేశారు. స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్ధేశంతో నిజామాబాద్లో ఇటీవల ఐటీ హబ్ను ఏర్పాటు చేశామన్నారు.
భవిష్యత్తులో మరిన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయని చెప్పారు. మరొక కంపెనీ కూడా పరిశ్రమను స్థాపించడానికి ముందుకొచ్చిందని, 260 సీట్లు తీసుకుంటామని ఆ కంపెనీ వర్గాలు అంటున్నాయని వెల్లడించారు. మనసున్న మంచి మనిషి గణేశ్ గుప్తా అని చెప్పారు. ఆయనకు అండగా నిలబడాలని ఆర్యవైశ్యులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆయనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.