బోధన్ : తెలంగాణ కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే తాము ఓటు అడగమని, రుజువు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )సవాలు విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్( Bodhan)నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ కు మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో కవిత పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ రంగంలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో 1.6 లక్షల మంది ఇప్పటికే ఉద్యోగాల్లో చేరారని వివరించారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణను తెర్లుకానివ్వవద్దని కోరారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేదని, సకాలంలో ఎరువులను సరఫరా చేయలేదని, వడ్లు కొనుగోలు చేయలేదని ఎత్తిచూపించారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రాం రాం అవుతుందని స్పష్టం చేశారు.
రానున్న ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతామని తెలిపారు. సీఎం కేసీఆర్ మాటంటే మాటేనని, చెప్పినవి చేసి చూపించారని పేర్కొన్నారు. బోధన్లో ఎన్ఎస్ఎఫ్ భూముల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బోధన్లో షకీల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.