MLC Kavitha | రేవంత్రెడ్డి నేతృత్వంలోని సర్కారు జారీ చేసిన గెజిట్ను, ఆదేశాలను ధిక్కరించి జగిత్యాల పట్టణంలో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రానికి వచ్చిన కవితకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని జీవోలు, గెజిట్లు జారీ చేసినా ఉద్యమ తెలంగాణ తల్లినే తాము ప్రతిష్టించుకుంటామని తేల్చిచెప్పారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యమకాలంలో తెలంగాణ తల్లి తమకు స్ఫూర్తిని ఇచ్చిందని.. ధైర్యాన్ని నింపిందని తెలిపారు. ఉద్యమ తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను కాపాడుకొని విశ్వమంతా వ్యాపింపజేస్తామని తెలిపారు. తెలంగాణ అస్థిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన ఎండగడుతామని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టిస్తామని ప్రకటించారు.
సారంగాపూర్లోని కస్తూర్బా పాఠశాలను కవిత సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో ముచ్చటించి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కస్తూర్బా పాఠశాలలకు పెంచిన డైట్చార్జీలను ప్రభుత్వం వర్తింపజేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయని, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారన్నారు. పెంచిన డైట్ చార్జీలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కస్తూర్బా విద్యార్థినులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని, ఈ విషయంపై రాజీ పడవద్దని ప్రభుత్వానికి సూచించారు. సర్వశిక్ష అభియాన్ పథకం కింద పనిచేస్తున్న వారితో పాటు కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను రెగ్యులరైజ్ చేస్తానని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, వెంటనే ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో జూనియర్ కాలేజీని మంజూరు చేయాలని స్థానికులు కోరారని, దాంతో అప్పటి సీఎం కేసీఆర్ జూనియర్ కాలేజీని మంజూరు చేశారని, త్వరలో అది ప్రారంభమవుతుందని చెప్పారు. కేసీఆర్ ఏ లక్ష్యంతో అయితే గురుకుల పాఠశాలల పెట్టారో ఆ లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవరించిందని, దానికి ప్రతిచర్యగా బీఆర్ఎస్ ఉద్యమిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమాల వల్ల ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచడం, నూతన డైట్ మెనూను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై విలేకరులు అడిగిన కవిత స్పందించారు. సంజయ్ పార్టీ మారినా కూడా ప్రజలు కేసీఆర్తో బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వచ్చి జగిత్యాలలో ప్రచారం చేసినా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి అయిన సంజయ్ కుమార్ను ప్రజలు గెలిపించారని, అంటే ఇది సంజయ్ వ్యక్తిగత గెలుపు కాదని, కేసీఆర్ గెలుపుగా చూడాలని సూచించారు. నాయకులు పార్టీ మారినంత మాత్రానా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని, బీఆర్ఎస్ కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో గులాబీ జెండాను ఎగరేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.