హైదరాబాద్: అమెరికాలోని తెలుగు ప్రజలు భారతదేశం గర్వించే స్థితికి చేరుకున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆటా అంటే ఆంధ్ర, తెలంగాణ అసోసియేషన్గా అభివర్ణించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని వెల్లడించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించారు. రచయిత్రి ప్రభావతి రాసిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆటా మహాసభల్లో తొలిసారిగా తెలంగాణ పెవిలియన్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలవడంతో పాటు, భవిష్యత్ తరాలకు తెలియజేయవచ్చని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అమెరికాలో ఉన్న తెలుగు వారికి తెలియజేసేందుకు ఇది ఒక వేదికగా నిలుస్తుందని వెల్లడించారు. ఆటా అంటే ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్గా అభివర్ణించారు. అమెరికాలో తెలుగువారికి ఆటా గుర్తింపు తెచ్చిందన్నారు. మహాసభల ద్వారా తెలుగు సంస్కృతిని ముందు తరాలకు తెలియజెప్పేందుకు ఆటా ప్రతినిధులు చేస్తున్న కృషిని కొనియాడారు. భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగువారు ఎదిగారని కవిత గుర్తుచేశారు.
అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు తానా, ఆటాలకు ఎదైనా నగరంలో హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసి, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మ్యూజియం లాంటిది ఏర్పాటు చేస్తే భవిష్యత్తు తరాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మాల్దీవులు, మారిషస్లో ఉన్న తెలుగు వారంతా, తెలుగు భాషను, సంస్కృతిని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. తెలుగు సంస్కృతి, సాంప్రధాయాలను అమెరికాలోని తెలుగ ప్రజల భవిష్యత్ తరాలకు అందించేందకు గాను, ఆటాకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుందని తెలిపారు.