హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు అమలు కోసం భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటానికి డెన్మార్ ఎన్నారైలు మద్దతు పలికారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశంపై రూపొందించిన అవగాహన పోస్టర్ను డెన్మార్క్ ఎన్నారైలు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డెన్మార్క్ ఎన్నారైల ప్రతినిధి ఆకుల శ్యామ్బాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత ఏ ఉద్యమం చేపట్టినా సఫలమయ్యే వరకూ వదిలిపెట్టరని కొనియాడారు.
బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో ఆమె చరిత్రాత్మక పాత్ర పోషించారని, రక్షాబంధన్ రోజు ఆమె ప్రారంభించిన గిఫ్ట్ ఏ హెల్మెట్కు విస్తృత ఆదరణ లభించిందని కొనియాడారు. కవిత ఇచ్చిన పిలుపు మేరకు తాము డెన్మార్క్లో గిఫ్ట్ ఏ హెల్మెట్కు ప్రచారం చేశామని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో మహిళా రిజర్వేషన్ బిల్లుపై డెన్మార్క్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నారైలు జయచందర్ గంట, శ్రీనివాస్రావు బండారి, ఖాజా అక్తర్, రాజశేఖర్ గొల్లపూడి, కృష్ణచైతన్య నిమ్మలపల్లి, సుఖ్దేవ్సింగ్, మహితా తదితరులు పాల్గొన్నారు.