ఇది ఉద్యోగార్థుల జీవితాలను మార్చిన రోజు
తెలంగాణ ఉద్యమ ఆశయం పరిపూర్ణం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం
హైదరాబాద్, మార్చి 9 : నాడు డిసెంబర్ 9న చేసిన ప్రకటన తెలంగాణ ప్రజల జీవితాలను మార్చితే.. మార్చి 9న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఉద్యోగార్థుల జీవితాలను మార్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటనపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ ఆశయం ఇప్పుడు పరిపూర్ణంగా సాకారమైందని పేర్కొన్నారు. 11,103 కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 80,039 వేల ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చారిత్రాత్మకమని అన్నారు. 95% ఉద్యోగాలు శాశ్వతంగా తెలంగాణ బిడ్డలకే దకేలా సీఎం కేసీఆర్ కేంద్రంతో కొట్లాడారని గుర్తుచేశారు.
‘తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకే వస్తయనే నమ్మకంతో మనం పోరాటం చేశాం. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం దాదాపు 30 శాతం ఉద్యోగాలు నాన్లోకల్కు వెళ్లేవి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడు సంవత్సరాల కృషి ఫలితంగా 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే రానున్నాయి. జోనల్, మల్టీజోనల్ పోస్టులకు విడివిడిగా నోటిషికేషన్, పరీక్ష విధానాలు వంటివాటివల్ల అనేక ఉద్యోగాలు మన తెలంగాణ బిడ్డలకే వస్తాయి. ఇది ఒక్క సంవత్సరంతో ఆగిపోయేది కాదు. భవిష్యత్తులో తెలంగాణలో ఎప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసినా.. 95 శాతం మన బిడ్డలకే వస్తాయని గర్వంగా చెప్తున్నా. డిసెంబర్ 9 చరిత్రలో నిలిచిపోయినట్టే.. మార్చి 9 కూడా చరిత్రలో నిలిచిపోతుంది’ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని తప్పుగా అర్థం చేసుకొంటున్నాయని, జీవో 317 గురించి అర్థం చేసుకోలేక నానా యాగీ చేశాయని విమర్శించారు. 8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పార్లమెంటులో చెప్పిన మోదీ ప్రభుత్వాన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలని అడిగే దైర్యం రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ఉందా? అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.