MLC Kavita : తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. ఇప్పటికే కవితకు విధించిన ఏడు రోజుల కస్టడీ గడువు నేటితో ముగియడంతో.. ఈడీ అధికారులు ఆమెను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. మరో మూడు రోజులు ఆమెను తమకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దాంతో కోర్టు కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది.
అంతకుముందు కోర్టులోపలికి వెళ్తూ ఆమె.. ఈడీ విచారణపై అసహనం వ్యక్తంచేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని అన్నారు. తనపై పెట్టింది రాజకీయ కేసని, తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసని వ్యాఖ్యానించారు. తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని, కోర్టులో న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
కాగా, కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాదులు కోరారు. కేసులో మరికొన్ని అంశాలపై విచారణ జరపాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. నలుగురి స్టేట్మెంట్లతోపాటు కిక్ బ్యాగ్స్ గురించి కవితను అడిగామని చెప్పారు. లిక్కర్ కేసులో కోట్ల రూపాయలు చేతులు మారయన్నారు. డాక్టర్ల సూచన ప్రకారం కవితకు మందులు, డైట్ ఇస్తున్నామని తెలిపారు.