హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం ప్రజావాణిని వినడం లేదు.. ఢిల్లీవాణినే వింటున్నారని విమర్శించారు. ప్రజావాణికి ఒకరోజే హాజరైన సీఎం వారానికి రెండుసార్లు ఢిల్లీకి పయనమవుతున్నారని ఎద్దేవా చేశారు.
2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై బుధవారం శాసనమండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. కౌన్సిల్ ప్రతిష్టను, గౌరవ మర్యాదలను భంగపరిచేవిధంగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న ఐదేండ్ల అభివృద్ధికి పునాది వేసే బడ్జెట్లో ప్రజలకు ఏమి చేస్తారో ప్రభుత్వం చెప్పలేకపోయిందని మండిపడ్డారు. గ్యారెంటీల్లో 10% అంశాలు కూడా బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం బాధాకరమని విమర్శించారు.
రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు తెలంగాణ బస్సును పంపించడాన్ని తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఖర్చులకు తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఒక నిమిషం కూడా కరెంటు పోలేదని, ఇప్పుడు హైదరాబాద్లోనే రోజుకు 3-4 గంటలు కరెంటు పోతుంటే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. గత రెండు నెలల్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ముగ్గురు ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే స్పందించడానికి సీఎంకు తీరిక లేదా? అని ప్రశ్నించారు.
బడ్జెట్లో హామీలకు కేటాయింపులేవి?
బడ్జెట్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే దాదాపు రూ.1.36 కోట్లు అవసరమనే అంచనాలు ఉండగా, బడ్జెట్లో రూ.53 వేల కోట్లు మాత్రమే కేటాయించారని కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మహాలక్ష్మి పథకం కింద 18 ఏండ్లు నిండిన 1.39 కోట్ల ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వాలంటే రూ.49 వేల కోట్లు అవసరమవుతాయని, ఈ అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించలేదని ఎండగట్టారు.
కళ్యాణలక్ష్మి కింద రూ.లక్షతోపాటు తులం బంగారం హామీని ఎప్పుడు అమలుచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పేరిట ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇస్తారా? పురుషుల పేరిట ఉన్న కనెక్షన్లకు కూడా ఇస్తారా? అన్న అంశంపై స్పష్టత లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్కు నిధులు కేటాయించలేదని విమర్శించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఏటా కనీసం రూ.20 వేల కోట్లు అవసరం కాగా, రూ.7 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని దుయ్యబట్టారు. మైనారిటీ మంత్రి లేకుండా ప్రభుత్వం నడవడం ఇది చరిత్రలో తొలిసారి అని పేర్కొన్నారు. తక్షణమే మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. కులగణన కోసం రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. బీసీ సబ్ప్లాన్కు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు.
2014-2023 వరకు తాము ఏం చేశామో చెప్తామని, 2004- 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని, అందుకు ప్రత్యేకంగా చర్చ పెట్టాలని సవాల్ చేశారు. ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తున్నామని, ఆ తర్వాత తప్పులను ఎత్తిచూపిస్తామని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని విమర్శించారు. రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై మండలిలో చర్చించాలని మండలి చైర్మన్ గుత్తాకు కవిత లేఖ రాశారు.