‘నమస్తే తెలంగాణ దినపత్రిక, టీన్యూస్ చానల్ బీఆర్ఎస్ పార్టీకి చెందినవని బాజాప్తా ప్రకటించినం. అందులో పార్టీ విధానాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, వార్తలను ప్రసారం చేస్తామని చెప్పినం. అవే చేస్తున్నం’
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్నిరంగాల్లో పరుగులు తీస్తున్న తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ మీడియా సంస్థలతో తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తూ, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయని, ఆ శక్తులను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రాష్ట్ర సాధనలో అండగా నిలిచిన విధంగానే తెలంగాణ ప్రగతికి జర్నలిస్టులందరూ అండగా నిలవాలని కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్లో మూడురోజులపాటు నిర్వహించ తలపెట్టిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ద్వితీయ మహాసభలు, ఇండియన్ జర్నలిస్టు యూనియన్(ఐజేయూ) 10వ ప్లీనరీకి ఎమ్మెల్సీ కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ జ్యోతిప్రజ్వలన చేసి, మహాసభలను ప్రారంభించారు. అనంతరం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గడచిన తొమ్మిదేండ్లలో ఒకసారి కూడా మీడియా సమావేశం నిర్వహించి, పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మాత్రం వందలాది జర్నలిస్టులతో అనేక మీడియా సమావేశాలు నిర్వహించి, ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పారని గుర్తుచేశారు.
తెలంగాణ అస్థిత్వం కోసం, తెలంగాణ ప్రజల కోసం టీయూడబ్ల్యూజే పోరాడినవిధంగానే జాతీయస్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి దాదాపుగా 17 రాష్ర్టాల్లో ప్రతినిధులను కలిగి ఉన్న ఐజేయూతో టీయూడబ్ల్యూజే కలుస్తున్నదని అల్లం నారాయణ పునరుద్ఘాటించారు. కానీ జీవితంలో ఒక్కనాడు కూడా తెలంగాణ అననివారు, కుట్రలు చేసేవారు, యూనియన్ రాజకీయాలు నడిపినవారు, ప్రెస్క్లబ్లను ఆక్రమించుకుని నిధులను స్వాహా చేస్తున్నవారు నేడు నీతులు చెప్తున్నారని ధ్వజమెత్తారు. తమ పునాదులు కదులుతున్నాయనే ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ వెంట నడచి తెలంగాణ సాధించామని, నిజాయితీగా, నిబద్ధతతో జర్నలిస్టుల సంక్షేమానికి పనిచేస్తూ వస్తున్నామని చెప్పారు. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అంశం ఒక కొలిక్కి వచ్చిందని, ఇండ్ల స్థలాల సాధనకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, క్రాంతికిరణ్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పాత్రికేయులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఆదివారం సాయంత్రం ఐజేయూ ప్రెసిడెంట్ వినోద్కోహ్లీ ఆధ్వర్యంలో కొనసాగిన ప్లీనరీని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి చేస్తున్న కృషిని వివరించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం ఉన్నదని భరోసా ఇచ్చారు. వినోద్కోహ్లీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మీడియా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నదని, జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వాటిని ఐక్యపోరాటాలతో తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. ప్లీనరీకి ఐజేయూ ఫౌండర్ సురేశ్ అథోరి, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు, దైనిక్భాస్కర్ ఎడిటర్ భూపేశ్, ఐజేయూ కార్యదర్శి సబినా ఇంద్రజిత్, నారాయణ పంచాల్(మహారాష్ట్ర), స్మితన్జీ(కేరళ), నవీన్శర్మ(చండీగఢ్), జోగిందర్సింగ్(హర్యానా), రంజు(పంజాబ్), ప్రదీప్(అస్సాం), హిందువన్(హిమాచల్ప్రదేశ్)తోపాటు 17 రాష్ర్టాల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. సోమ, మంగళవారాల్లో కూడా మహాసభ కొనసాగనున్నది.
తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులతోపాటు అన్ని వర్గాల, కులాల అభ్యున్నతికి పాటుపడుతున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు, హెల్త్కార్డులను అందజేస్తున్నదని గుర్తుచేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. తెలంగాణ సమాజంలో గతానికి, నేటికి వచ్చిన మార్పులను జర్నలిస్టులు గమనించాలని, వాటిని ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తిచేశారు. స్వరాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ బతుకు భరోసా లభించిందని వివరించారు. జర్నలిస్టులు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. జర్నలిస్టుల పోరాటం, త్యాగం తెలంగాణ ఎన్నడూ మరచిపోదని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని భరోసా ఇచ్చారు.
మీడియా సంస్థల విశ్వసనీయతతోపాటు ప్రసారం చేస్తున్న వ్యక్తులకు నిబద్ధత ఉన్నప్పుడే ఆ వార్తలపై విశ్వాసం కలుగుతుందని, కానీ నేడు వార్తల మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి రావడం బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ‘నమస్తే తెలంగాణ దినపత్రిక, టీన్యూస్ చానల్ బీఆర్ఎస్ పార్టీకి చెందినవని బాజాప్తా ప్రకటించినం. అందులో పార్టీ విధానాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, వార్తలను ప్రసారం చేస్తామని చెప్పినం. అవే చేస్తున్నం’ అని కవిత స్పష్టం చేశారు. కానీ, కొన్ని మీడియా సంస్థలు మాత్రం కావాలనే తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని కాకుండా, చిన్న చిన్న లోటుపాట్లను భూతద్దంలో చూపుతూ నాయకత్వాన్ని నీరుగార్చి కుట్రలతో ప్రజలను పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇలాంటి రాతలపై జర్నలిస్టులు సైతం ఆలోచించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలంవీరులు సీఎం కేసీఆర్తో నడిచారని, ఇప్పుడు కూడా అండగా నిలవాలని కోరారు. స్వరాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. ఇతరత్ర సమస్యలకు కూడా పరిషారం చూపిస్తారని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు రూ.100 కోట్ల నిధిని కేటాయించినట్టుగానే కేంద్రం సైతం జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు కేటాయించేలా డిమాండ్ చేయాలని, అందుకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.