MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 8న ధర్నాచౌక్లో నిరసన వ్యక్తం చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత కవిత ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు తెలిపారు. 8న జరిగే ధర్నాకు మిగతా వాళ్లు కూడా కలిసి రావాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇస్తున్న ఉద్యోగ నియామకాలు అన్నీ కేసీఆర్ చేపట్టినవేనని.. రేవంత్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ డీఎస్సీ మాత్రమేనని స్పష్టం చేశారు. గురుకుల నియామకాలను ఆరోహణ క్రమంలో నింపడం సరికాదన్నారు. తన నివాసంలో మీడియాతో కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
ప్రభుత్వం కొత్తగా జీవో నంబర్3ని తీసుకొచ్చిందని.. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా మహిళా దినోత్సవం రోజున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. 33శాతం రావాల్సిన రిజర్వేషన్ పూర్తిగా వెనక్కి పోయిందని.. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాల ఉద్యోగాల నియామకాల్లో మహిళలకు కేవలం 12 శాతం ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని.. చాలా మంది మహిళలకు అన్యాయం జరిగినందున జీవో 3ని తక్షణమే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో ఆడబిడ్డలకు అన్యాయం చేయవద్దని గతంలోనే కోరామని, 626 ఉద్యోగాల్లో కేవలం 77మాత్రమే ఆడబిడ్డలకు వచ్చాయన్నారు. 33శాతానికి పైగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు రావాల్సింది.. పోయి 12 శాతం మాత్రమే వస్తున్నాయని కవిత ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసిందని, మహిళలకు అన్యాయం చేయబోమని కేసీఆర్ అప్పీలుకు వెళ్లారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మొదటి ముద్దాయిగా ఉన్నారని, కేసును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
సోనియాను బలిదేవత అన్న సీఎం ఇవాళ సోనియా, రాహుల్ను పోటీకి ఆహ్వానిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని గుర్తు పెట్టుకొని ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఓటర్లకు కవిత పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీని రేవంత్ పెద్దన్న అని సంభోదించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని అర్థం అవుతుందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని మోదీ.. ఎలా పెద్దన్న అవుతాడని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని కవిత మండిపడ్డారు. పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. నీళ్లు ఇచ్చే ఆస్కారం ఉండి ఇవ్వకపోవడం రైతులపై కక్ష సాధింపు మాత్రమేనని కవిత కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.