MLC Kavitha | రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీలు సమాధానం చెప్పాలన్నారు. కామారెడ్డిలో యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీసీల బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలా బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52 శాతం అని తేలిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అదే కాంగ్రెస్ చేసిన సర్వే ద్వారా బీసీల జనాభాను తగ్గించి, ఓసీల జనాభాను పెంచారని ఆరోపించారు. గ్రామాల వారీగా, కులాల వారీగా ప్రభుత్వం జనాభా లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇంతవరకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదని అన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కవిత అన్నారు. కానీ తమ పోరాటం వల్లనే విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ చట్టాలు చేసిందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీసీలకు లక్షా 55 వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని చెప్పారు. నాడు కులవృత్తులను బలోపేతం చేస్తుంటే కొంతమంది ఎగతాళి చేశారని గుర్తుచేశారు. కానీ గత 15 నెలలుగా కులవృత్తులు ఏ విధంగా కుదేలయ్యాయో చూస్తున్నామని చెప్పారు.
బీసీ నాయకత్వం బలపడటానికి ఐదుగురిని రాజ్యసభకు, 8 మందికి ఎమ్మెల్సీ,58 మందికి కార్పొరేషన్ చైర్మన్ల పదవిని ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పదవీ ఎప్పడూ బీసీ బిడ్డలకు దక్కలేదని.. అలాంటిది మొట్టమొదటి సారి రవీందర్ యాదవ్ను కేసీఆర్ ఓయూ వీసీ చేశారని అన్నారు. అడ్వొకేట్ జనరల్గా బీసీ బిడ్డ అయిన ప్రసాద్ ను నియమించిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చిందని.. దాంతో తెలంగాణలో రిజర్వేషన్లు 54 శాతం అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 50 శాతం పరిమితి మించింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేశామని స్పష్టం చేశారు.