MLC Kavitha | హైదరాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మూడోవంతు రిజర్వేషన్ బిల్లు సాధించేదాక విశ్రమించబోమని మహిళాలోకం ఢిల్లీ జంతర్మంతర్ వేదికగా జంగ్సైరన్ మోగించింది. భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ఒక రోజు దీక్షకు అపూర్వ మద్దతు లభించింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా కేంద్రంలోని ప్రభుత్వాలు బిల్లు తేకుండా మహిళలను వంచిస్తున్నాయని నారీలోకం ఆగ్రహం వ్యక్తంచేసింది. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ రెండుసార్లు మహిళా బిల్లు తెస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పటివరకు తేలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. మహిళల పట్ల మోదీకి, బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేసింది. దేశ మహిళల పక్షాన నిలిచిన ఎమ్మెల్సీ కవితకు అన్ని రకాలుగా అండగా ఉంటామని పలు రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు స్పష్టంచేశాయి.
ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు సంతోష్కుమార్, వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, అజ్మీర రేఖానాయక్, పలు కార్పొరేషన్ చైర్పర్సన్లు ఆకుల లలిత, శ్రీదేవి, ఎస్ వేణుగోపాలా చారి, జడ్పీ చైర్పర్సన్లు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ మహిళా నేతలు మాధవి, సునీత, షాగీన్ అఫ్రోజ్, ఆయేషా, దుబాయి ఎన్ఆర్ఐ కన్వీనర్ ఖాజా ఖదీరొద్దీన్, తెలంగాణ ఎంప్లాయిస్ అసొసియేషన్ అధ్యక్షుడు చిలగాని సంపత్కుమార్స్వామి, సెక్రటరీ జనరల్ జీ నిర్మల, కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మపెట్టాలని పోరాటం చేస్తున్న సంఘం జాతీయ అధ్యక్షుడు జెర్రిపోతుల పరశురాం దీక్షలో పాల్గొని కవితకు మద్దతు ప్రకటించారు. అలాగే 28 రాష్ర్టాల నుంచి వచ్చిన మహిళా సంఘాలు, ఎన్జీవో సంఘాల ప్రతినిధులు వందలాదిగా ధర్నా శిబిరానికి తరలివచ్చి సంఘీభావం తెలిపారు. అకాళీదల్ నేత నరేశ్ గుజ్రాల్ (మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కుమారు), జమ్ము కశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నేత అంజుమ్ జావేద్ మీర్జా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత షమీ ఫిర్దౌజ, టీఎంసీ నేత సుస్మితాదేవ్, జేజీయూ నేత కేసీ త్యాగీ, ఎన్సీపీ నేత సీమామాలిక్, సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, సమాజ్వాదీ పార్టీ నాయకురాలు పూజ శుక్లా, ఆర్ఎల్డీ నాయకులు శ్యామ్ రాజక్, ఇంటర్నేషనల్ సిఖ్ కౌన్సిల్ నేత ప్రియా గుప్త తదితరులు కవిత దీక్షకు మద్దతు తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్మంతర్ గళమెత్తింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో పెట్టకపోతే బీజేపీని బండకేసి కొట్టుడేనని మహిళలు ధర్మాగ్రహం వ్యక్తంచేశారు. కవులు, కళాకారులు, గాయకులు తమతమ కళారూపాలను ప్రదర్శించారు. దేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, యువతులపై జరుగుతున్న అత్యాచారాలు, ఆడపిల్లల అవకాశాలపై వివక్ష మొదలైన అంశాలపై ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, భారత జాగృతి విభాగం ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ఒక రోజు దీక్ష విజయవంతం అయ్యింది. మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించేందుకు తాను చేపట్టిన దీక్షకు, పోరాటానికి మద్దతు తెలిపిన పార్టీలకు కవిత వేదిక పైనుంచి ధన్యవాదాలు తెలిపారు.