MLC Kavita | తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి ఫలాలు ఎలా అందుతున్నాయో చూడాలని సవాల్ విసిరారు. మంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. మిషన్ కాకతీయ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం అమృత్ సరోవర్ పేరిట అమలు చేస్తున్న కార్యక్రమం విఫలమైందని, ఆ కార్యక్రమానికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో దేశంలో చెరువులు బాగవ్వడం లేదని విమర్శించారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం బోధన్ నియోజకవర్గంలోని ఎడవల్లిలో స్థానిక ఎమ్మెల్యే షకీల్తో కలిసి చెరువుల పండుగ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడకముందు 75 ఏండ్ల క్రితం చెరువులు నిండుకుండలా ఉండేవని, ప్రజల జీవితమంతా చెరువు చుట్టే ఉండేదని గుర్తు చేశారు. తిరిగి తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 వేల కోట్ల వ్యయంతో 47 వేల చెరువులను మరమ్మత్తు చేసుకున్నామని చెప్పారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను రక్షించాలన్నది ప్రభుత్వ ఉద్ధేశమని, అవి ఎప్పటికీ ఎండిపోవద్దన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద దాదాపు 20 వేల చెరువులను నింపుతున్నామని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణలో ప్రాంతంలోని నీటి వనరులను కొల్లగొట్టారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. దాని వల్ల మనం ఆగమైనందునే ఇవాళ చెరువులను మంచిగ చేసుకుంటున్నామన్నారు. చెరువు మంచిగయ్యి పంటలు పండడం మొదలైతే ఊరుఊరంతా బాగుంటుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రైతాంగంపై అధికంగా దృష్టి సారించారని తెలిపారు. చెరువులు బాగుచేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లో చేప పిల్లలను వేస్తున్నదని, దాంతో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నదని వివరించారు. ఏదైనా ఒక్క మంచిపని జరిగితే దాని ఫలితాలు ప్రత ఒక్కరికి అందుతాయన్నారు.
పదేండ్ల క్రితం రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి కనీసం ఆయన సొంత గ్రామంలో కూడా 20 – 30 మందికి పెన్షన్ ఇప్పించుకోలేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. పెన్షన్ వస్తున్న ఎవరైనా మరణిస్తేనే ఆ స్థానంలో కొత్త వాళ్లకు పెన్షన్ మంజూరు చేసేవారని తెలిపారు. అటువంటి పరిస్థితిలో దుఖంతో మనం తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. కానీ ఈ రోజు ఊరిలో ఎంత మంది దరఖాస్తు చేస్తే అంత మందికి పెన్షన్ వస్తున్నదని, బీడీ కార్మికులకు కటాఫ్ డేట్ సడలించి మరీ పెన్షన్ ఇచ్చామని తెలిపారు.
`కాంగ్రెస్ నాయకుడు మహేశ్ కుమార్ గౌడ్ లొల్లి చేస్తుండని ఆ పార్టీ వాళ్లు చిన్న పదవి ఇచ్చారు. పదవి ఇచ్చిన తర్వాత లొల్లి ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడు. ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారని ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ అన్నా… ఒక్కసారి ఎడపల్లి వచ్చి చూడు అన్న. పెన్షన్లు , కేసీఆర్ కిట్ లు ఎన్ని ఇచ్చామో చూడు. అందుకే సంబరాలు చేసుకుంటున్నాం` అని మహేశ్ గౌడ్ కు కౌంటర్ ఇచ్చారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏడాది మొత్తంలో రూ. 600 కోట్ల విలువైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసేదని, 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 12 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని కవిత తెలిపారు. కాబట్టి ఇవాళ సంబరాలు చేసుకుంటున్నామని తేల్చిచెప్పారు. గతంలో పండిన పంటను ఎక్కడ అమ్మాలో తెలియని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు పంటకు పెట్టుబడి ఇవ్వడమే కాకుండా పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే పరిస్థితిని తెచ్చామని తెలిపారు.
10 ఏళ్ల తెలంగాణలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వస్తున్నామని, మొదటి ఐదేండ్లలో చెరువుల్లో పూడికలు తీసుకున్నామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. చెక్ డ్యాములు నిర్మించుకోవడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నామని, పెన్షన్లు ఇచ్చుకున్నామని వివరించారు. ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకోడానికి గృహ లక్ష్మి పథకం కింద రూ. 3 లక్షల పంపిణీ కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్లాట్లు చేసి ఇచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే షకీల్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ వల్లే దాదాపు 12-13 రాష్ట్రాల్లో చెరువుల మరమ్మత్తు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మెన్ విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు