బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. దళిత బంధు ద్వారా, దేశంలొ దళితులను వ్యాపారవేత్తలుగా మారుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన ఆమె.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. మోదీ మిత్రుడనే కారణంగా అదానీకి ఏడు విమానాశ్రయాలు అమ్మారంటూ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వరంగల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి, ఉద్యోగులను ఆగమాగం చేస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారతదేశం పేదవారుండే దేశమని.. ప్రభుత్వం బడులు, బస్సులు నడిపితేనే పేదవాళ్లను ప్రైవేటు వాళ్లు దోపిడి చేయకుండా అడ్డుకోవచ్చని అన్నారు.
ఆ ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా, పేదలకు వైద్యం అందించాలని వరంగల్లో జైలు తీసీసి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ కడుతోందన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ కన్నతండ్రి లాగ ప్రజలను కళ్లలో పెట్టుకుని చూసుకోవాలన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా, పేదల అవసరాలను గమనించిన సీఎం కేసీఆర్.. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఆర్టీసీని కాపాడుతున్నారని చెప్పారు.
అలాగే పేదవారి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ‘‘ఆటో రిక్షాలకు పన్నులు రద్దు చేశాం. 25 వేల విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. సింగరేణితో నాకు దగ్గరి అనుబంధం ఉంది. సింగరేణి కార్మికులకు గత 75 సంవత్సరాలలో జరగని డెవలప్మెంట్, కేవలం 8 సంవత్సరాలలో చేసిన ఘనత కేసీఆర్దే. కార్మికుడి చెమట చుక్క విలువ తెలియని ప్రభుత్వాలు మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదు’’ అని తెలిపారు.
అక్కడితో ఆగకుండా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘ప్రభుత్వంలో ఉన్న సంస్థలను అమ్మడం, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల హక్కులను హరించే విధంగా బీజేపీ ప్రభుత్వం చట్టాలు చేస్తోంది. గతంలో 44 చట్టాలు ఉంటే, వాటిని తీసేసి ప్రస్తుతం 4 కార్మిక నియమాలను తెచ్చారు. కార్మికుల సంఘం పెట్టొద్దు.. పెట్టిన సంఘం చెప్పకుండా సమ్మె చేస్తే దాన్ని రద్దు చేస్తం.. కార్మికులకు సమ్మె చేసే హక్కు లేదు.. కార్మికులు కనీస వేతనం అడిగే హక్కు లేదు.. బోనస్ అడిగే హక్కు లేదు.. కార్మికులకు ఏ హక్కు లేదని ఈ 4 చట్టాల ద్వారా బీజేపీ చెప్తోంది’’ అంటూ ప్రభుత్వం చేసిన చట్టాలను ఎండట్టారు.
కార్మికుల హక్కులు హరించే విధంగా ఈ 4 నల్ల చట్టాలు ఉన్నాయని, వీటిని వెనక్కి తీసుకునేదాకా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులందరి హక్కులు కాపాడుకున్న రోజే, కార్మికుల శ్రమకు గౌరవం ఇచ్చిన రోజే భారతదేశం ముందుకెళ్తుందన్నారు. 1919లో కార్మికులకు సంబంధించిన ఒక సంఘం పుట్టిందని, అనంతరం అనేక సంఘాలు ఏర్పడ్డాయని వివరించిన కవిత.. సంఘాలు ఉన్నాయ్ కాబట్టే కార్మికులకు హక్కులు లభిస్తున్నాయని చెప్పారు.
మోదీ తెచ్చిన చట్టాలు బ్రిటిషోళ్ల కన్నా దారుణంగా ఉన్నాయని మండి పడిన ఆమె.. ‘‘మోదీ చట్టాల ప్రకారం కార్మికులతో 12 గంటలయినా పని చేయించుకోవచ్చట. ఓవర్ టైం ఇయ్యాలని అడగొద్దట. 8 గంటలు దాటి పనిచేస్తే ఓవర్ టైం ఇయ్యాలని అడిగే హక్కు ఇంతకుముందు ఉండేది. ప్రస్తుతం మోడీ తెచ్చిన చట్టాలతో, ఎన్ని గంటలు పని చేయించినా అడిగే హక్కు కార్మికులకు లేదు’’ అని కార్మిక వ్యతిరేక చట్టాలను విమర్శించారు.
300 మందికి మించి కార్మికులుంటే, అందులో పరిశీలనకు పోయేందుకు ప్రభుత్వానికి హక్కు లేదట. కంపెనీలు ఇష్టం వచ్చినట్లు నడుపుకోవచ్చట అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత.. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లకు తొత్తుగా పనిచేస్తోందని దుయ్యబట్టారు. లక్షల కోట్ల విలువైన ఎయిర్ ఇండియాను కేంద్రం వేలకోట్లకే అమ్మేసిన విషయాన్ని గుర్తుచేసిన ఆమె.. బొగ్గు గనులు, కరెంటు కంపెనీలు యావత్ దేశంలో ఉన్న అన్ని సంస్థలను అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని సంస్థలు ప్రైవేటు వాళ్లకు అమ్మితే పేదలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.
‘‘మోదీ మిత్రుడు కాబట్టి అదానీకి ఏడు ఎయిర్ పోర్టులు అమ్మారు. మొన్న పరాయి దేశ ప్రధాని లండన్ నుండి వచ్చి, ప్రధానిని కాకుండా నేరుగా అదానీని కలిసాడు. అంటే దేశ ప్రధాని మోదీ కాదన్నమాట. అదానీనే మన నిజమైన ప్రధాని అని ప్రపంచం అంతా చెవులు కొరుక్కుంటోంది’’ అని విమర్శించారు.
‘‘పరిశ్రమలు రావాలి. కానీ కార్మికుల హక్కులు పరిరక్షించకపోతే, భవిష్యత్ తరాల పిల్లల ఉద్యోగాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. వరంగల్లో టెక్స్ టైల్ పార్క్ పెడుతున్నాం. ఇది సీఎం కేసీఆర్ కల. పరిశ్రమలన్నీ హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ మాత్రమే ఉండద్దు.. జిల్లాల్లో పరిశ్రమలు ఫెడితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తయని కేసీఆర్ఇ క్కడ 2 వేల ఎకరాలల్లో పరిశ్రమలు పెట్టెలా చేశారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తలకు భూములు, నీళ్లు, అనేక రాయితీలు ఇస్తున్నం. కానీ అందులో పనిచేస్తున్న కార్మికుల హక్కులను కూడా కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉంటది’’ అని కవిత అన్నారు.
‘‘టీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన నిలబడే పార్టీ. టీఆర్ఎస్ పార్టీ యువకులు, మహిళల పక్షాన నిలబడే పార్టీ. బీజీపీ నల్ల చట్టాలతో రైతులను ఇబ్బంది పెట్టింది. రైతుల పోరాటానికి దిగివచ్చి నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. రైతుల స్పూర్తిని కార్మికులు అందిపుచ్చుకోవాలి. ఆ స్పూర్తితో ఉద్యమాలు చేసి, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలు రద్దు చేసేవరకూ పోరాటం చేయాలి. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి. కార్మికుల పోరాటానికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారు. ప్రస్తుతం దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునేందుకు టీఆర్ఎస్ పోరాడుతుంది’’ అని స్పష్టంచేశారు.
‘‘ఎన్నికలకు ముందు మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తమని చేప్పారు. ఎనిమిది ఏండ్లలో ఉద్యోగాలు ఇయ్యలేదు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. కానీ రాష్ట్రంలో లక్షా 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఉద్యోగాలు ఇయ్యకుండా యువతను వేధిస్తున్న పార్టీ బీజేపీ, ఉద్యొగాలు ఇచ్చి యువతకు అండగా నిలుస్తున్న పార్టీ టీఆర్ఎస్. అంగన్ వాడీ మహిళలకు దేశంలో అత్యధిక జీతాలు ఇస్తున్నది కేవలం తెలంగాణలోనే. ఇది మనందిరికీ గర్వకారణం’’ అని కవిత చెప్పారు.
‘‘మోదీ ఐసీడీఎస్ బడ్జెట్ సగానికి సగం తగ్గించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.500 కోట్లు కేటాయించి అంగన్ వాడీ అక్కా చెల్లెళ్లకు జీతాలు పెంచింది. మార్కెట్ కమిటీల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్. బీజేపీది ఎన్నికలకు ముందు ఒకమాట.. ఎన్నికల తర్వాత ఒకమాట. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ముందు ఇంటింటికీ ఉచితంగా రేషన్ ఇస్తమన్నరు. ఎన్నికలు ముగిసాక అనేక నిబంధనలు పెట్టి, రేషన్ కట్ చేసారు’’ అని ఆమె వివరించారు.
‘‘ప్రధాని మోదీ ఎప్పడూ, అయితే ఎలక్షన్ మోడ్, లేకపోతే ఎరోప్లేన్ మోడ్లో ఉంటారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పిన అనేక హామీలను నిజం చేస్తోంది. వరంగల్ లాంటి పట్టణంలో, పేద ప్రజలకు స్థలం ఉంటే ఇళ్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో ఇళ్లు లేని వారు ఉండకూడదనేది సీఎం కల. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం లాగే, పట్టణ పేదలకు కూడా ఉపాధి హామీ పథకం ఉండాలని మనందరం డిమాండ్ చేద్దాం. దళిత బంధు ద్వారా, దేశంలో దళితులను వ్యాపారవేత్తలుగా మారుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దాస్యం వినయ్ భాస్కర్ గారు గత 30 రోజులుగా కార్మికుల పక్షాన చేసిన కృషిని అభినందిస్తున్నాను’’ అంటూ కార్మికులకు కవిత అండగా నిలిచారు.