మాదాపూర్, ఏప్రిల్ 23: క్యాన్సర్ మరణాలు నానాటికీ పెరుగుతున్నాయని, పరీక్షల ద్వారా వ్యాధిని ముందుగా గుర్తిస్తే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో శనివారం కోలన్ క్యాన్సర్పై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్కు సరైన చికిత్స చేయించుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడవచ్చని అన్నారు. కోలన్ క్యాన్సర్ను గుర్తించడానికి స్క్రీనింగ్ చేయించుకున్నట్లయితే 50 శాతం ముందుగానే తెలుసుకోవచ్చని తెలిపారు.
మహిళలు రొమ్ము క్యాన్సర్పై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు క్యాన్సర్పై అవగాహన పెంచేందుకు హైదరాబాద్ బైకింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కేర్ ఫర్ కోలన్ పేరుతో 300 మందితో 10 కిలోమీటర్ల మేర ఏఐజీ దవాఖాన నుంచి ఖాజాగూడ లేక్ పాయింట్, ఐకియా మీదుగా తిరిగి ఏఐజీ వరకు సైక్లోథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐజీ హస్పిటల్ చైర్మన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి, వైద్య సిబ్బంది, హైదరాబాద్ బైకింగ్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.