MLC Kavitha | మలిదశ తెలంగాణ ఉద్యమ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఆదివారం ఎమ్మెల్సీ కవిత ఆయన భార్య పద్మావతి, కుమారుడు రాహుల్ను కలిశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
గతంలో తమ కూమార్తె ప్రియాంక వైద్య విద్య అభ్యసించడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆర్థిక సాయం చేసిన విషయాన్ని గుర్తు చేసిన పద్మావతి చేసుకొని.. కృతజ్ఞతలు తెలిపారు. ఇదే తరహాలో భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ పోలీస్ కిష్టయ్య కుటుంబానికి దన్నుగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబాలను కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకున్నారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కవిత వెంట టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తనోబా ఉన్నారు.