చారిత్రక ముందడుగుకు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మంచి అవకాశం. రాజకీయాలకతీతంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్టీలన్నీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.
– ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని రాజకీయ పార్టీలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మహిళా బిల్లు చారిత్రక అవసరమని, చట్టసభల్లో సరిపడా మహిళల ప్రాతినిధ్యం ఉంటేనే దేశం పురోగమిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు మంగళవారం లేఖ రాశారు.
చారిత్రక ముందడుగు వేయడానికి ప్రజాప్రతినిధులకు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఒక మంచి అవకాశం అని, రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఏకమై అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని కవిత స్పష్టం చేశారు. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో మహిళల ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని లేఖలో వివరించారు. సమాజంలో సగభాగం మహిళలు ఉన్నప్పటికీ చట్టసభల్లో మాత్రం ప్రాతినిధ్యం సరిపడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైరుధ్యం దేశ పురోగతికి విఘాతం కలిగిస్తున్నదని, ప్రజాస్వామ్య సూత్రాలను బలహీనపరుస్తున్నదని పేర్కొన్నారు. మహిళలకు విస్తృత స్థాయిలో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే బిల్లును ఆమోదింపజేయాలని 47 రాజకీయ పార్టీలకు మంగళవారం ఆమె రాసిన లేఖకు అపూర్వ స్పందన లభించింది. లేఖ రాసిన కొద్ది గంటల్లోనే అనేక పార్టీల నాయకులు స్పందించారు. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తిని అంగీకరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఉంటామని ప్రకటించడమే కాకుండా, ఆమె చేస్తున్న కృషిని ఎన్సీపీ, జేడీయూ, సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, ఆర్జేడీ వంటి కీలక పార్టీలు అభినందించాయి. జాతీయ మీడియాలో కవిత రాసిన లేఖపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చాలా అవసరమని, ఎంతమేర రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంపై పార్లమెంట్లో చర్చ జరగాలని ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పష్టం చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం మహిళా బిల్లును తీసుకొస్తే తాము మద్దతిస్తామని ప్రకటించారు. కానీ, మహిళా బిల్లుకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వటం లేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నదని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలంగా మారుతుందని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. లేదంటే మరో 25 ఏండ్ల పాటు వాటి కోసం పోరాడాల్సి వస్తుందని వెల్లడించారు. రిజర్వేషన్లలో రిజర్వేషన్లు (రిజర్వేషన్స్ విత్ ఇన్ ది రిజర్వేషన్) కల్పిస్తూ బిల్లును రూపొందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా సంక్షేమం కోసం తమ పార్టీ పాటుపడుతుందని సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకురాలు పూజా శుక్లా తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ అనుకూలమని, మహిళలకు అవకాశాలు కల్పించడంలో తమ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ముందుంటారని వెల్లడించారు. బిల్లు కోసం కవిత చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. తమ పార్టీ కూడా మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నదని టీఎంసీ నాయకురాలు, బెంగాల్ మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి శశిపంజా వివరించారు. మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారని పేర్కొన్నారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చారిత్రక అవసరమని టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ తెలిపారు. మహిళా బిల్లు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వెల్లడించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును కేంద్ర సరార్ ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ గతంలో ఢిల్లీ కేంద్రంగా ఎమ్మెల్సీ కవిత ధర్నా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళ రిజర్వేషన్ బిల్లు పెట్టేలా ఒత్తిడి తీసుకొచ్చేలా ఎమ్మెల్సీ కవిత దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు.