MLC Kavita: అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కారు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (X)లో విమర్శించారు. ఈ మేరకు ఆమె ఒక పోస్టు పెట్టారు. ఇటీవల జారీచేసిన గ్రూప్ – 1 నోటిఫికేషన్.. రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. ఈ పద్ధతివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
అసలు రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించగలరా..? అని ఆమె ప్రశ్నించారు. 563 గ్రూప్ -1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రోస్టర్ పాయింట్లను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేసి మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు.