హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): లష్కర్లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి భక్తులు శోభాయమానంగా బోనాలు సమర్పించారు. ఆదివారం తొలిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజుల నృత్యాలు, కోలాట బృందాలు, గుస్సాడీ, పులివేషధారణ, డప్పు కళాకారుల చప్పుళ్లతో అమ్మవారి ఆలయ ప్రాంగణం శోభాయమానంగా మారింది. రెండేండ్ల తర్వాత భక్తులను పూర్తిస్థాయిలో అనుమతించడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి బారులు తీరారు. బోనాల వేడుకలు ఘటోత్సవంతో మొదలయ్యాయి.
తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్పార్చనలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తన కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించి పూజలు చేశారు. బోనాల జాతర కోసం ఏర్పాట్లను అన్ని విభాగాలు సమన్వయంతో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారంటూ మంత్రి ప్రశంసలు కురిపించారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం 9 గంటల నుంచే వీఐపీల రాక మొదలైంది. రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.
అమ్మవారిని దర్శించుకొన్న మంత్రులు
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని హోంమంత్రి మహమూద్ అలీ దర్శించుకొన్నారు. అన్ని పండుగలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగగా బోనాలు అవతరించాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. ఇందుకు సీఎం కేసీఆర్ చొరవే కారణమని పేర్కొన్నారు. అమ్మవారి దయతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కార్మికులు, కర్షకులు, రైతులు, ప్రజలందరినీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు చల్లగా చూడాలని మొక్కుకున్నట్టు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
మహానగరానికి పెద్ద ఆశీర్వాదం అమ్మవారు: ఎమ్మెల్సీ కవిత
మహంకాళి, మాణిక్యాలమ్మలు వెలిసిన పవిత్ర స్థలం సికింద్రాబాద్ అని, అమ్మవారి ఆలయానికి వందల ఏండ్ల చరిత్ర ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి పెద్ద ఆశీర్వాదం అమ్మవారేనని పేర్కొన్నారు. అమ్మవారి కృపతోనే జంటనగరాలు సిరిసంపదలతో వర్ధిల్లుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న తరుణంలో సీఎంతోపాటు వేలాది పురోహితులు చేసిన పూజల ఫలితంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. మొండా డివిజన్ ఆదయ్యనగర్ కమాన్ నుంచి ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం ఎత్తుకొని మంత్రి తలసాని దంపతులతో కలిసి అమ్మవారికి సమర్పించి పూజలు నిర్వహించారు. వందల మంది మహిళలు బోనాలతో కవిత వెంటసాగారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్, బేవరేజెస్ చైర్మన్ గజ్జెల నాగేశ్, టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయికిరణ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.