నల్లగొండ, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలోని ప్రతీ ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేటుకు అమ్మేస్తున్న నరేంద్ర మోదీ సర్కార్.. ప్రభుత్వాలను కూడా ప్రైవేటుపరం చేస్తుందేమోనని శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవాచేశారు. ఒక్కొక్కటిగా అన్నీ అమ్మేశాక ఇక ప్రభుత్వం చేసేది ఏముంటుందని ప్రశ్నించారు. వాజ్పేయీ హయాంలో మొదలైన ప్రైవేటీకరణ, మోదీ పాలనలో తారస్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. శుక్రవారం నల్లగొండలోని తన నివాసంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డితో కలిసి గుత్తా మీడియాతో మాట్లాడారు. 16లక్షల కోట్ల లాభాల్లో ఉన్న బ్యాంకులను ప్రైవేటీకరిస్తామనడంతోనే దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలపై పోరాడిన విధంగానే మోదీ సర్కారు వినాశకర విధానాలను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలను తమ తాబేదారులైన కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం విషయంలో కేంద్రం నవ్వులపాలైందని, యాసంగిలో బియ్యం వద్దనడంతోనే రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడుతున్నదని మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్పై దిగజారుడు మాటలు కట్టిపెట్టి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రేవంత్రెడ్డి లాంటి బ్లాక్మెయిలర్లను, దొంగలనే బహిష్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చురకలు వేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, నేల విడిచి సామును మానుకుంటే మంచిదని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీకి భయపడిపోయి.. ఇప్పుడు ఏవేవో మాట్లాడటం తగదన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 12 స్థానాలను గెలిపించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.