హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతోనే ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థి పేరుకు ఎదురుగా కేటాయించిన చోట 1, 2, 3 అంకెలను వెయ్యాల్సి ఉంటుందని చెప్పారు. ఇతర పెన్నులతో వేసిన ఓట్లు చెల్లుబా టు కావని స్పష్టంచేశారు. ఓటు వేయడానికి ఓట రు గుర్తింపుకార్డు లేకుంటే మరో తొమ్మిది రకాల గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేయవచ్చని గోయల్ పేర్కొన్నారు. ఆదివారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు శుక్రవారం ప్రచారం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ తెలిపారు. ఆదివారం జరుగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఏర్పాట్లపై శశాంక్ గోయల్.. శుక్రవారం జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో 10,36,833 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 85 శాతం మంది కొత్తవారేనని తెలిపారు. 17న కౌంటింగ్ ఉంటుందన్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంలో 799 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు గోయల్ వెల్లడించారు. ఈ నియోజకవర్గం పరిధిలోని మొత్తం 9 జిల్లాల్లో 5,31,268 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని, నియోజకవర్గానికి 880 జంబో బ్యాలెట్ బాక్కులు సిద్ధంచేసినట్లు గోయల్ వెల్లడించారు. ముందు జాగ్రత్తగా ఒక్కో కేంద్రానికి 1, 2 పెద్ద బ్యాలెట్ బాక్సులు కూడా ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 17న ఓట్ల లెక్కింపు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 8 హాళ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గంలో 731 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు శశాంక్ గోయల్ తెలిపారు. ఈ నియోజకవర్గం పరిధిలో 12 జిలాల్లో 5,05,565 మంది ఓటర్లున్నారని, 71 మంది ఎన్నికల్లో పోటీపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గానికి 805 జంబో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కోసం నల్లగొండలోని మార్కెటింగ్శాఖ గిడ్డంగిలో 8 హాళ్లు, 56 టేబుళ్లు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. పోలింగ్ రోజు ఒక్కో అభ్యర్థికి రెండు వాహనాలకు తోడు అదనంగా ప్రతి జిల్లాకు మరో వాహనం అనుమతిచ్చినట్లు చెప్పారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శుక్రవా రం మగిసింది. మార్చి 14న పోలింగ్ నేపథ్యం లో 48 గంటల ముందే ప్రచారం ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ప్రచారం చేశా యి. ఈ నెల 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ నెల 14న సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని, మళ్లీ ఓట్ల లెక్కింపు రోజైన 17న మూసివేయాల్సిందిగా ఎన్నికల సంఘం అదేశించింది. 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది.
ఈ నెల 14వ జరిగే ఎమ్మెల్సీ పోలింగ్కు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా తొమ్మిది రకాల గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటువేసే అవకాశముంటుంది ఓట్లు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారి గుర్తింపు నిర్ధారించడంకోసం ఓటరు గుర్తింపు కార్డు కానీ లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన మరే గుర్తింపుకార్డునైనా చూపాలి. ఆధార్కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, పాన్కార్డు, ఎంఎల్ఏ, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు సంబంధిత విద్యా సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్డు, యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీ/డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్లు, దివ్యాంగులకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డులో ఏదైన ఒకటి తప్పనిసరిగా ఉండాలి. పోలింగ్రోజు ఆదివారం ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని అధికారులు పేర్కొన్నారు.