Group-1 | ఖైరతాబాద్, మార్చి 15 : రాష్ట్రంలో జరిగిన గ్రూప్ పరీక్షల్లో అన్ని అవకతవకలే ఉన్నాయని ఎమ్మెల్సీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. మార్చి 10న వచ్చిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఒక సామాన్య పౌరుడికి చూపించినా తప్పులు వెలుగులోకి వస్తాయన్నారు. ప్రభుత్వం చర్యల వల్ల సంవత్సరాల తరబడి పరీక్షల కోసం సన్నద్దమైన నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం తీసుకువచ్చిన జీవో నం. 55 సోషల్ జస్టిస్కు ప్రతిరూపమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దానికి తొలగించి జీవో నం. 29 తీసుకువచ్చి ఏం ఒరగబెట్టిందన్నారు. యూపిఎస్సీ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న గ్రూప్ 1ను నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. గ్రూప్ 1, 2, 3 పరీక్షా ఫలితాలను వెల్లడించిన నేపథ్యంలో గ్రూప్ 2, 3లో జీఆర్ఎల్ను స్పష్టంగా ప్రకటించిన ప్రభుత్వం, గ్రూప్ 1లో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జీఆర్ఎల్ ఇచ్చి పబ్లిక్ డొమైన్లో పెడితే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తేటతెల్లమయ్యేదన్నారు. దీని వెనుక కుట్ర జరిగినట్లు తెలుస్తోందన్నారు.
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్రిలీజ్లో సైతం జీఆర్ఎల్ ప్రస్తావన రాలేదని, ఎందుకు వెల్లడించలేదని, ఇందులో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గత నోటిఫికేషన్ ఆధారంగా రూపొందించిన మెయిన్స్ పాత ప్రశ్నాపత్రాలనే గత ఏడాది అక్టోబర్లో నిర్వహించిన పరీక్షల్లో ఇచ్చారని నిరుద్యోగులు చెబుతున్నారని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నాపత్రాలను ఎవరితో దిద్దించారన్న విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాలన్నారు. మెయిన్స్ ప్రక్రియలో యూపీఎస్సీ ప్రమాణాలకు పాటిస్తామని మాజీ టీజీపీఎస్సీ చైర్మన్, ప్రస్తుత టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పారని, అది పాటించిన దాఖలాలు కనబడడం లేదన్నారు.
పేపరు దిద్దే వ్యక్తుల అర్హతలు, బ్యాక్గ్రౌండ్ ఏమిటనేది బహిర్గతం చేయాలన్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో దిద్దించామని చెబుతున్న ప్రభుత్వం వారికిచ్చిన బ్లూ ప్రింట్లో ఎంత మేరకు శాస్త్రీయత ఉందో వివరించాలన్నారు. తెలుగు మీడియం విద్యార్థుల కోసం తయారు చేసిన బ్లూ ప్రింట్ గూగుల్లో ట్రాన్స్లేట్ చేసినదిగా తెలిసిందని, తద్వారా ఆ విద్యార్ధులకు ఏం న్యాయం జరుగుతుందని, తాము అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పేపర్లు దిద్దించారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. అంతేకాకుండా హడావుడిగా ప్రశ్నాపత్రాలను దిద్దించి, ఫలితాలు విడుదల చేయడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు.
టాప్ 100 మందిలో ఎంత మంది ఇంగ్లీషు, తెలుగు, ఉర్ధూ మీడియం విద్యార్ధులు ఉన్నారో చెప్పాలన్నారు. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్ధులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ టాప్ 100 విద్యార్థుల ప్రశ్నాపత్రాలను ఎక్స్పర్ట్ కమిటీ వేసి మరోసారి దిద్దించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే 20,100 ప్రశ్నాపత్రాలను మూడు నెలల సమయం తీసుకొని రీకౌంటింగ్ కాకుండా రివాల్యుయేషన్ చేయాలని, నిష్ణాతులపై ప్రొఫెసర్తో దిద్దించాలని డిమాండ్ చేశారు.
విద్యావేత్త అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో టాప్ 500లో 37 శాతం మంది ఓసీ అభ్యర్థులు ఎంపికయ్యారని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కనిపించడం లేదన్నారు. ఇందులో కుట్రలు జరిగాయన్నారు. అలాగే 200 పైగా ఉద్యోగాలు అమ్ముకున్నారని, ఇందులో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ విఠల్ మాట్లాడుతూ గ్రూప్స్లో జరిగిన అవకతవకలపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.