హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు అరెస్టు చేశారు. తన కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అతడిని అరెస్టు చేసిన పోలీసులు.. సోమవారం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అంతకు ముందు కాకినాడలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్కు తరలించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కారు డ్రైవర్ను తానే చంపినట్టు అతడు అంగీకరించాడు. సుబ్రమణ్యం తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందునే తానే స్వయంగా హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇంటికొచ్చి డ్రైవర్ను తీసుకెళ్లిన దగ్గర్నుంచి, హత్యచేసి ఇంటికి మృతదేహాన్ని తరలించే వరకు జరిగిన విషయాలను పోలీసులకు పూస గుచ్చినట్టు వివరించినట్టు తెలిసింది. ‘నా వ్యక్తిగత విషయాలు అందరికీ చెప్తానని బ్లాక్మెయిల్ చేశాడు. మొదట సుబ్రమణ్యాన్ని కొట్టి బెదిరిద్దామనుకున్నా. కానీ అదంతా అలా జరిగిపోయింది’ అని ఎమ్మెల్సీ చెప్పినట్టు అదనపు ఎస్పీ శ్రీనివాస్ ధ్రువీకరించారు. అరెస్టుకు ముందు ఎమ్మెల్సీ అరెస్టు సమాచారాన్ని శాసనమండలి చైర్మన్కు తెలియజేసినట్టు పోలీసులు తెలిపారు.