నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleshwaram Project) పై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ( High Court ) ఇచ్చిన తీర్పును మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashant Reddy ) హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో న్యాయం గెలిచిందని ఆయన పేర్కొన్నారు.
కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేలిందన్నారు.ముఖ్యంగా సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకమని తెలిపారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్లను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడిందని విమర్శించారు.
న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా, చివరకు నిజం గెలిచిందని అన్నారు.తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీయాలనే ఉద్దేశంతో,కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కక్షపూరితంగా వ్యవహరిం చాయని విమర్శించారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం చేశారని, చివరకు గత్యంతరం లేక ఇప్పుడు పనులు చేపడుతున్నారని విమర్శించారు.న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే విశ్వాసానికి హైకోర్టు తీర్పు నిదర్శనమని పేర్కొన్నారు.