Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన గురువుకే పంగనామాలు పెట్టారు. తొలి జాబితాలో చిన్నారెడ్డికి వనపర్తి నియోజకవర్గం టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మొండిచెయ్యి చూపారు. సోమవారం 16 మంది అభ్యర్థులతో మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. ఇందులో వనపర్తి నియోజకవర్గం నుంచి జిల్లేల చిన్నారెడ్డి పేరును తొలిగించి, తుడి మేఘారెడ్డికి కేటాయించింది. బోథ్ టికెట్ను మొదట వెన్నెల అశోక్కు కేటాయించగా, తాజాగా ఆ స్థానాన్ని ఆదె గజేందర్కు కేటాయించింది.
తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడతోపాటు చార్మినార్ స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించకుండా కాంగ్రెస్ పెండింగ్లోనే పెట్టింది. చెన్నూరులో నాలుగు రోజుల క్రితం పార్టీలో చేరిన వివేక్కు టికెట్ ఇచ్చి స్థానికంగా పార్టీని నమ్ముకుని ఉన్న బోడ జనార్దన్, రాజా రమేశ్, రాజా రవి, రామిండ్ల రాధికను నిరాశ పర్చారు.
బాన్సువాడలో కొత్తగా పార్టీలో చేరిన ఏనుగు రవీందర్రెడ్డికి టికెట్ ఇవ్వడంతో కాసుల బాలరాజుకు నిరాశే మిగిలింది. పటాన్చెరులో ఇటీవల కాంగ్రెస్లో చేరిన నీలం మధుకు టికెట్ కేటాయించి, కాటా శ్రీనివాస్కు అన్యాయం చేశారు.
సత్తుపల్లి టికెట్ మట్టా దయానంద్ భార్య మట్టా రాగమయికి ఇచ్చి, ఓయూ విద్యార్థి నేత మానవతారాయ్కు మొండిచేయి చూపించారు. రేవంత్రెడ్డి కామారెడ్డి నుంచి పోటీకి దిగుతుండటంతో షబ్బీర్అలీకి నిజామాబాద్ అర్బన్ కేటాయించారు. నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్పై ఆశలు పెంచుకున్న గాలి అనిల్కుమార్కు టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది.