దుమ్ముగూడెం/ చర్ల, సెప్టెంబర్ 18: ‘ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్.. మాటలు నీటి మూటలేనా?’ అంటూ బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకులు నిలదీశారు. ‘నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకే అధికార పార్టీలోకి వెళ్తున్నాను. నిధుల వరదతో భద్రాచలం ఏజెన్సీ ప్రాంత రూపురేఖలు మారుస్తా’ అంటూ చెప్పిన మాటలు నీటిమీద రాతలు ఎందుకయ్యాయని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్లోకి వెళ్తున్నానని చెప్పి అధికార పార్టీలోకి వెళ్లిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, భద్రాచలం వాజేడు ప్రధాన రహదారికి మెరుగైన మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో బీఆర్ఎస్ నేతలు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
భద్రాచలం వాజేడు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భద్రాచలం నుంచి వాజేడు వరకు ఉన్న 150 కిలోమీటర్ల ప్రధాన రహదారి ఇసుక లారీల వల్ల అనేక ప్రాంతాల్లో గుంతలమయమైనా, ప్రయాణికుల ప్రాణాలు పోతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రజాసమస్యల పరిషార వేదికగా ఉండాల్సిన భద్రాచలం ఎమ్మెల్యే కార్యాలయం కమీషన్ల కేంద్రంగా మారిందని ఆరోపించారు.