నర్సాపూర్, ఏప్రిల్ 13 : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. పూటకో పార్టీ మారే కొండా సురేఖ తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు.
ఎన్ని పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో ఓసారి గుర్తుచేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే తాను పార్టీని వీడలేదని, పదేండ్లు కాంగ్రెస్ జెండాను భుజస్కంధాలపై మోశానని గుర్తుచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను జిల్లా అధ్యక్షురాలిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, తన వివరణ అడగకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి 2 గంటల్లోపే తనను సస్పెండ్ చేశారని, అందుకే తాను కాంగ్రెస్ను వీడాల్సి వచ్చిందని తెలిపారు. ఎలాంటి పదవులు ఆశించకుండా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరినట్టు చెప్పారు. కానీ, కొండా సురేఖ మాత్రం కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి, అక్కడి నుంచి కాంగ్రెస్లో చేరిన విషయాన్ని మరిచి తనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని కొండా సురేఖ అనడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై బీఆర్ఎస్పై బురద జల్లడం తగదని సూచించారు.