కొడంగల్, జూన్ 19 : మహేశ్వరం నియోజకవర్గంలోని భూములపై సీఎం రేవంత్రెడ్డి నజర్ పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టుగా మహేశ్వరం ప్రాంతంలోని భూముల చుట్టూ రేవంత్రెడ్డి చక్కర్లు కొడుతున్నాడని దుయ్యబట్టారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాలులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సబితారెడ్డి మాట్లాడుతూ.. 30 నెలల పాలనలో రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గానికి మూడు సార్లు వస్తే.. మహేశ్వరంలో 30 సార్లు పర్యటించినట్టు పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమం ఎవరైనా ఉదయం వేళలో నిర్వహిస్తారని.. మొన్న రేవంత్రెడ్డి సాయంత్రం 5 గంటల తరువాత మొక్కలు నాటడం చూస్తే విడ్డూరంగా ఉన్నదని అన్నారు. ఆయన మహేశ్వరానికి వచ్చేందుకు ఏదో ఒక సాకు వెతుకుతున్నట్టు ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో నెలకో కొత్త పథకంతో ప్రజా సంక్షేమానికి బంగారు బాటలు వేయగా.. రేవంత్ పాలనలో నెలకో కొత్త స్కామ్ను చూసి విస్తుపోవాల్సిన దుస్థితి నెలకొన్నదని అన్నారు. రేవంత్రెడ్డి.. ఉన్న పథకాలకే పేరు మార్చి వాటిని ప్రారంభిస్తున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ప్రజా వ్యతిరేకతను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో రేవంత్రెడ్డి పోటీ చేయడం కూడా కష్టమేనన్న అనుమానాన్ని వ్యక్తంచేశారు.
గాడితప్పిన సంక్షేమం: శ్రీనివాస్గౌడ్
కేసీఆర్ సాధించిన తెలంగాణతోనే రేవంత్రెడ్డి సీఎం అయ్యాడని, అటువంటి నేతను దూషించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతు సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించి పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు. హైదరాబాద్ తరహాలో పాలమూరు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ హయాంలో శిల్పారామాన్ని ఏర్పాటు చేయగా.. ఎటువంటి నోటిఫికేషన్, సమావేశం లేకుండా రేవంత్ సర్కార్ పదేండ్లపాటు లీజ్కు ఇచ్చిందని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, వికారాబాద్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, పార్టీ కొడంగల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.