హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, సిట్ కేసులో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి, తుషార్ వెల్లపల్లి, కరీంనగర్ న్యాయవాది బీ శ్రీనివాస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్లలోని మధ్యంతర పిటిషన్లపై (ఐఏ)శుక్రవారం జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ఎదుట వాదనలు పూర్తయ్యాయి. సీఎం మీడియా సమావేశంలోని వీడియోలంటూ పిటిషనర్ హైకోర్టుకు సమర్పించిన వాటిని పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది సాయికృష్ణ కోరారు.
వీడియోల వ్యవహారంపై పిటిషనర్లు అనుబంధ మధ్యంతర పిటిషన్లు(ఐఏ) దాఖలు చేయడాన్ని తప్పుపట్టారు. ఆ వీడియోలకు చట్టబద్ధత లేదని అన్నారు. వాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసినట్టు తెలిపారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాలంటే ఐటీ చట్టంలోని సెక్షన్ 65 బీ కింద అఫిడవిట్ కూడా దాఖలు చేయాలనే నిబంధనను గుర్తుచేశారు. పిటిషనర్లు సమర్పించిన యూట్యూబ్ లింకులను పరిగణనలోకి తీసుకోవడానికి చట్ట నిబంధనలు అంగీకరించవని చెప్పారు. హైకోర్టు ఐఏలపై తీర్పు వెలువరించేటప్పుడు ఈ వీడియోలను పరిగణనలోకి తీసుకోవద్దని, తమ వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది సెక్షన్ 65బీ ప్రకారం అఫిడవిట్ దాఖలు చేశాక ఐఏలపై తీర్పును వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న ప్రధాన కేసులో గురువారమే హైకోర్టు తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే.
సిట్ను తప్పుపట్టేలా పిటిషన్లు
కరీంనగర్ న్యాయవాది భూసారపు శ్రీనివాస్, ఇతరులు దాఖలు చేసిన ఐఏల్లోని విషయాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సిట్ ఖండిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన మెటీరియల్స్ అందుబాటులో లేకపోవడం వల్ల కోర్టు దృష్టికి పలు విషయాలను తీసుకురాలేకపోయానని పిటిషనర్ చెప్పడాన్ని తప్పుపట్టారు. దీన్ని బట్టి పిటిషనర్ దుర్మార్గపు ఆలోచనతో హడావుడిగా రిట్ దాఖలు చేశారనిపిస్తున్నదని తెలిపారు. సమాచారం గోప్యంగా లేదని పిటిషనర్ ఒక పక్క చెప్తూనే, మరో పక్క ఆ వివరాలు లేకపోవడం వల్ల కోర్టు దృష్టికి పలు విషయాలను చెప్పలేకపోయామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. సిట్ను తప్పుపట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పిటిషనర్ సమర్పించిన సీడీలోని హెటీఎంఎల్ లింక్, యూట్యూబ్ లింకులకు చట్టబద్ధత చూపలేదని అన్నారు. ఐటీ యాక్ట్ ప్రకారం సీడీలోని సమాచారం ఏ విధంగా సంపాదించారో పిటిషనర్ పేర్కొనకపోవడంతో సీడీకి చట్టబద్ధత ఉండదన్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలన్న ప్రధాన పిటిషన్తోపాటు కేసుకు చెందిన మెటీరియల్స్ ఇవ్వాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్(ఐఏ)ను కూడా కొట్టేయాలని కోరారు.
ముందస్తు బెయిల్కు జగ్గుస్వామి సోదరుడు రిట్
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు డాక్టర్ జగ్గుస్వామి సోదరుడు కేఎల్ మణిలాల్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను హైకోర్టు ఆదేశించింది. సిట్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ మనీలాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ సీ సుమలత శుక్రవారం విచారించారు. ఇతర నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, మణిలాల్కు కూడా ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. కౌంటర్ దాఖలు చేస్తామని సిట్ న్యాయవాది చెప్పారు. హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
నందకుమార్పై చీటింగ్ కేసు
బంజారాహిల్స్, డిసెంబర్ 16: హోటల్ నిర్మాణం కోసం ఇంటీరియర్ పనులు చేయించుకొని మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్కు చెందిన శ్రీనివాసకుమార్ ఇంటీరియర్, ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తుంటాడు. ఫిల్మ్నగర్ రోడ్ నం.1లోని దక్కన్ కిచెన్ ఇంటీరియర్ వర్క్ నిమిత్తం నందకుమార్ శ్రీనివాస్తో ఒప్పందం చేసుకొన్నాడు. రూ.27 లక్షలు బిల్లు కాగా రూ.10 లక్షలు చెల్లించాడు. మిగతా డబ్బులు ఇవ్వకుండా ముఖం చాటేయడంతో బాధితుడు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నది.
బెదిరింపు కేసులో రెండురోజుల కస్టడీ
ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో నందకుమార్ను రెండురోజుల పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. రియల్టర్ సతీశ్ను ఓ భూవివాదంలో బెదిరించిన నందకుమార్పై ఇటీవల కేసు నమోదైంది. అతడిని విచారించేందుకు కస్టడీకి అప్పగించాలని బంజారాహిల్స్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్కు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం ఆయన్ను కస్టడీకి తీసుకొని విచారించనున్నారు.