హైదరాబాద్: బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవమని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న రోహిత్ రెడ్డి.. దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయానికి రావాలని.. కర్ణాటక కేసుపై ప్రమాణం చేద్దామని బండి సంజయ్కి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే రోహిత్ రెడ్డి నేడు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన సవాల్ను ఎందుకు స్వీకరించలేదని బండి సంజయ్ని ప్రశ్నించారు. కర్ణాటక పోలీసులు తనను ఎప్పుడూ విచారణకు పిలువలేదని, ఏ ఎఫ్ఐఆర్లోనూ తన పేరు లేదని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవాలు లేవన్నారు.
బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. వారికి అనుకూలంగా లేనివారిని బీజేపీ టార్గెట్ చేస్తున్నదని ఆరోపించారు. అధికార పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలతో టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలు తప్పని ప్రజలకు అర్థమయిందన్నారు. మతం పేరుతో యువతనును రెచ్చగొడుతున్నాడని చెప్పారు.
బండి సంజయ్కు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న రఘునందన్ రావు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. పరిశ్రమల యజమానులను బెదిరించలేదా అని నిలదీశారు. గతంలో ఓ మహిళ రఘునందన్పై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఎంఐఎం నేతలతో టచ్లో ఉన్నదని వాస్తవం కాదా అన్నారు.