సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 27: సెస్ ఎన్నికల్లో బీజేపీ నాయకుల కుట్రలను ప్రజలు తిప్పి కొట్టి, బీఆర్ఎస్ను ఆశీర్వదించారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మోదీ అరాచక పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు కేసీఆర్లో దేవుడిని చూశారని, అందుకే దేవుడికి పరమాన్నం పెట్టినట్టు సెస్లో15 డైరెక్టర్ స్థానాలను గెలుచుకున్నారని పేర్కొన్నారు.
మార్కెట్ వ్యవస్థను పునరుద్ధరించాలని ఉద్యమించి అసువులు బాసిన రైతుల కుటుంబాలను బీజేపీ పట్టించుకోలేదని, రైతులను దేవుళ్లలా భావించే సీఎం కేసీఆర్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలిచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదన్న విషయాన్ని రైతాంగం సెస్ ఎన్నికల ద్వారానే నిరూపించిందని చెప్పారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతాంగానికి ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా వంటివి అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు.