హైదరాబాద్ : విద్వేష వ్యాఖ్యల కేసులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను అరెస్టు చేసిన పోలీసులు.. భారీ భద్రత నడుమ మధ్య చర్లపల్లి జైలుకు తరలించారు. రాజాసింగ్ అరెస్టు సమయంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ్నుంచి నేరుగా రాజాసింగ్ను ముషీరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజాసింగ్ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అరెస్టుకు ముందే పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు రాజాసింగ్కు నోటీసులు జారీ చేశారు.
మంగళ్హాట్ పోలీసు స్టేషన్లో గతంలోనే రాజాసింగ్పై రౌడీషీట్ ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. గతంలో ఉన్న కేసులను ఆధారంగా చేసుకొని ఆయనపై పీడీ యాక్ట్ పెట్టినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈనెల 22వ తేదీన శ్రీరామ అనే యూట్యూబ్ ఛానల్లో రాజాసింగ్ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశాడంటూ పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా అభ్యంతరకర వీడియోలను యూట్యూబ్ చానెల్లో అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
2004 నుంచి రాజాసింగ్పై 101 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైనవే కావడం గమనార్హం. పీడీయాక్టు నమోదుతో రాజాసింగ్కు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఒక ఎమ్మెల్యేపై పీడీయాక్టు నమోదు కావడం ఇదే మొదటిసారి. రాజాసింగ్పై దేశవ్యాప్తంగా 42 కేసులు నమోదయ్యాయి.