ఖానాపురం/నిజాంసాగర్, గార్ల, జూన్ 17: ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్న ఆకాంక్ష ఆ యువకుడిది.. దానికోసం దేహాన్ని ఉక్కులా మార్చుకొన్నాడు.. దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.. సంవత్సరం పాటు కష్టపడి చదివాడు.. రాత పరీక్ష రాసి ఎంపికవటమే తరువాయి. కానీ, కేంద్రం అకస్మాత్తుగా ‘అగ్నిపథ్’ను తీసుకొచ్చింది. అదే అతడి పాలిట మృత్యువైంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన దామెర రాకేశ్ (21) శుక్రవారం సికింద్రాబాద్లో అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొనగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. రాకేశ్ తండ్రి కుమారస్వామి, తల్లి పూలమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. రాకేశ్కు అన్న రాంరాజ్, ఇద్దరు అక్కలు ఉషారాణి, రాణి ఉన్నారు. రాంరాజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి దివ్యాంగుడయ్యాడు.
సోదరి ఉషారాణి గృహిణి కాగా, మరొక సోదరి రాణి పశ్చిమ బెంగాల్లో బీఎస్ఎఫ్లో జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్క స్ఫూర్తితో రాకేశ్ కూడా చిన్ననాటి నుంచే ఆర్మీపై మక్కువ పెంచుకొన్నాడు. పదో తరగతి వరకు ఊరిలోనే చదివిన అతడు.. ఇంటర్ నర్సంపేటలో, హనుమకొండలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఏపీలోని బాపట్లలో రెండేండ్లు ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ కూడా తీసుకొన్నాడు. గతంలో రెండు సార్లు ఆర్మీలో జవాన్ ఉద్యోగం తృటిలో తప్పింది. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో హకీంపేటలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని బీఎస్ఎఫ్ జవాన్ ఉద్యోగానికి ఇటీవలే ఈవెంట్స్ పూర్తిచేశాడు. రాత పరీక్ష జరగాల్సి ఉన్నది. నాడు కరోనా వల్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి పరీక్ష కోసం ఎదురుచూస్తున్నాడు. రాత పరీక్ష రాసి ఎంపికైతే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని ఆశపడ్డాడు. ఈ క్రమంలో కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని తీసుకురావటంతో, తనకు అన్యాయం జరుగుతుందని భావించి ఈవెంట్స్ పూర్తి చేసిన తోటి మిత్రులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నాడు.
రాకేశ్ తనతో పాటు ఈవెంట్స్ పూర్తి చేసిన వరంగల్ జిల్లాకు చెందిన 15 మంది మిత్రులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొన్నాడు. వారంతా అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్లో ఆందోళన చేపట్టాలని వారం కిందటే నిర్ణయించుకొన్నారు. అందులో భాగంగానే గురువారం రాత్రి మరో 15మంది మిత్రులతో కలిసి హనుమకొండ నుంచి సికింద్రాబాద్కు వెళ్లారు. శుక్రవారం జరిగిన ఆందోళనలో అందరూ కలిసి పాల్గొన్నారు. కాగా, రాకేశ్ మృతితో దబీర్పేటలో విషాదం అలుముకొన్నది. ఊరిలో అందరితో తలలో నాలుకలా ఉండే రాకేశ్ ఇకలేడనే విషయం తెలిసి అతడి నానమ్మ చిలుకమ్మ కన్నీరుమున్నీరైంది.
సికింద్రాబాద్ ఆందోళనలో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి చెందిన ఇద్దరు ఆర్మీ అభ్యర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రానికి చెందిన పరశురాం, నర్వ గ్రామానికి చెందిన పెంటబోయిన మోహన్ గాయపడి ప్రస్తుతం గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరిదీ వ్యవసాయ కుటుంబమే. ఈ ఘటనలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వినయ్కు ఛాతి భాగంలో బుల్లెట్ దిగింది. ప్రస్తుతం గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. వినయ్ ఆరోగ్య పరిస్థితిపై ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ వైద్యులను ఆరా తీశారు.
నా కొడుకును కేంద్రమే బలి తీసుకొన్నది
రెండేండ్లుగా ఉద్యోగ రాత పరీక్ష నిర్వహించకుండా కాలయాపన చేసి చట్టాలను మార్చిన కేంద్ర ప్రభుత్వమే ఈ రోజు నా కొడుకును బలితీసుకొన్నది. ఉద్యోగం కోసం నా కొడుకు ఎన్నో కలలు కన్నాడు. చాలా కష్టపడ్డాడు. ఆ కల, కష్టం నెరవేరకుండానే చనిపోయాడు. కేంద్రం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది. వ్యవసాయం చేసుకొనైనా నా కొడుకును సాదుకొనేవాడిని. ఉద్యోగం కోసమని చేతికొచ్చిన కొడుకు చనిపోయాడు. ఈ బాధ మరెవ్వరికీ రాకూడదు. వెంటనే కేంద్రం ఆర్మీ చట్టాలను వెనక్కి తీసుకోవాలి.
– కుమారస్వామి, రాకేశ్ తండ్రి
రాకేశ్ మృతికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. రాకేశ్ ఉసురు తీసినందుకు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం నర్సంపేట నియోజకవర్గవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నామని, ఈ బంద్కు వ్యాపార, వాణిజ్యరంగాలతో పాటు ప్రజలు సహకరించాలని కోరారు. రాకేశ్ మృతి విషయం తెలియగానే దబీర్పేటకు చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న తుగ్లక్ నిర్ణయానికి యువకుడు బలయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ ఈ మృతికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకొంటామని చెప్పారు. రాకేశ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చేలా అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.