మెదక్ : మెదక్ నియోజకవర్గంలోని కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ పార్టీలకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడంతో పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని, అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ విజయం సాధిస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి(MLA Padmadevender Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు ఏకే గంగాధర రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ వర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పూర్వపు రామాయంపేట,మెదక్ నియోజకవర్గంలో మంచి పేరు ఉన్న సీనియర్ నాయకుడు, నాలుగు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఏకే గంగాధర రావు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.
సీనియర్ నాయకుల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజు, గవ్వలపల్లి ఉప సర్పంచ్ రామిరెడ్డి, ఏకే.రమేష్ చందర్ పాల్గొన్నారు.