మెదక్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చెప్పారు. మెదక్ MCH ఆస్పత్రిలో బుధవారం ఉదయం తన మనవడికి టీకా ఇప్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ ఆస్పత్రులు సమస్యలకు నిలయంగా ఉండేవన్నారు. దాంతో ప్రజలు ఆ ఆస్పత్రులకు వచ్చేందుకు జంకే వారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు.
ఆస్పత్రుల స్థాయి పెంచడంతోపాటు కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక యంత్రాలు, పరికరాలు సమకూర్చారని, వైద్యులతోపాటు ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేశారని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా అన్ని హంగులతో మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు ధీటుగా ఉన్న MCH లకు ఆదరణ బాగా పెరిగిందని, మెరుగైన వైద్య సేవలతోపాటు కేసీఆర్ కిట్, 12000 నగదు సాయం అందిస్తుండటంవల్ల వీటిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆమె చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీశ్ రావ్ బాధ్యతలు తీసుకున్న తరువాత మెదక్ జిల్లాలో ప్రభుత్వ పరంగా వైద్య సేవలు మెరుగు పరచడంపై స్పెషల్ ఫోకస్ పెట్టారని పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఆస్పత్రి ఐసీయూ, డయాలసిస్ సెంటర్, డయాగ్నోసిస్ హబ్, ఆక్స ప్లాంట్ వంటి సౌకర్యాలు అందుబాటులో కి వచ్చాయని, అన్ని రకాల చికిత్సలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వునియోగం చేసుకోవాలని కోరారు.